బతుకమ్మ పండుగకు చీరలు కానుకగా ఇవ్వడమనేది చాలా గొప్ప ఆలోచన అన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళలకు బతుకమ్మ చీరలను ఆయన పంపిణీ చేశారు. ప్రతిపక్షాలు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు చూసి ఓర్వలేక, ఎలాగైనా అడ్డుకోవాలని చూస్తున్నాయని మంత్రి విమర్శించారు. కోర్టులలో 296 కు పైగా కేసులు వేసి ప్రభుత్వ అభివృద్ధి పథకాలను అడ్డుకోవాలని చూసిన ప్రతిపక్షాలు ప్రజల ముందు అభాసుపాలయ్యాయని అన్నారు. బతుకమ్మ పండుగకు ప్రభుత్వం ఆడబిడ్డలకు ప్రేమతో ఇస్తున్న చీరలపై కూడా రాజకీయం చేయడం సిగ్గుచేటని మంత్రి మండిపడ్డారు. ప్రతిపక్షాలు నీచ రాజకీయాలు చేస్తూ చీరల్ని తగులబెట్టి మరోసారి తమ కుసంస్కారాన్ని బయటపెట్టుకున్నాయని మంత్రి ఘాటుగా విమర్శించారు. ప్రజలు అన్ని గమనిస్తున్నారని, ప్రతిపక్షాలకు తగిన బుద్ధి చెప్తారని మంత్రి అన్నారు.