ఓరుగల్లు ఖిల్లాలో అధ్వాన్నంగా తయారైన ప్రభుత్వ విద్య
విధులకు గైర్హాజరవుతున్న ఉపాధ్యాయులు
పలువురిని సస్పెండ్ చేస్తూ మంత్రి ఉత్తర్వులు
డిప్యూటి సిఎం సమీక్షకు గైర్హాజరైన ఎంఇఓలు
షోకాజ్ నోటీస్లు జారీ చేయాలని కడియం ఆదేశాలు
పలు పాఠశాలలో కనీస వసతుల కరువు
మేజర్న్యూస్ తెలంగాణ ప్రతినిధిః కెజి టు పిజి వరకు ఉచిత విద్యనందిం చేందుకు ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రణాళికలు రచిస్తున్నారు. ఎస్సి, ఎస్టి, మైనారిటీలకు 250 గురుకుల పాఠశాలలు మంజూరు చేస్తూ నిర్ణయం తీసుకు న్నారు. తెలంగాణలో రెండవ పెద్ద పట్టణమైన ఓరుగల్లును ఎడ్యుకేషన్ హబ్గా మార్చేందుకు సర్కార్ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే పలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నత విద్యాసంస్థలు నగరంలో నెలకొల్పేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.అయితే సాక్షాత్తు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ఓరుగల్లు జిల్లా నుండి ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తెలంగాణ వ్యాప్తంగా పది జిల్లాలోను విద్యా వ్యవస్థను గాడిలో పెడుతున్న కడియం వరంగల్ జిల్లా వ్యవస్థను మాత్రం మార్చలేకపోతున్నారు. ఓ వైపు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయులు డుమ్మా కొడుతూ విధులకు హజరవుతున్నారు. మరో వైపు సాక్షాత్తు ఆ శాఖ మంత్రి సమీక్షలు నిర్వహిస్తే దానికి ఎంఇఓలు హజరుకావడం లేదు. దీంతో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన డిప్యూటి సిఎం సమీక్షకు హజరుకాని వారికి షోకాజ్ నోటీస్లు జారీ చేయాలని ఆదేశించారు. మంగపేట మండలంలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కడియం విధులకు హజరుకాని పాఠశాల ప్రధానోపాధ్యాయునితో పాటు మరో ఇద్దరిని సస్పెండ్ చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. ఇక ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను పెంచేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించింది. జిల్లాలోని పలు మండలాలలో ఈ కార్యక్రమం అనుకున్న విదంగా సక్సెస్ కాలేదు. పలుచోట్ల తూ తూ మంత్రంగా నిర్వహించారనే ఆరోపణలున్నాయి.
ఉపాధ్యాయుల తీరుపై కడియం ఆగ్రహం
వరంగల్ జిల్లాలోని ఉపాధ్యాయుల తీరుపై కడియం శ్రీహరి ఆగ్రహం వ్యక్తం చేశారు. విధినిర్వహణలో ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్నారు. మారుమూల గిరిజన ప్రాంతాలలోని విద్యార్థులు పలువురు ఉపాధ్యాయుల తీరుతో వారి జీవితాన్ని కోల్పోతున్నారు. క్షేత్ర స్థాయిలో జిల్లా వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా ఈ ఏడాది నుండి ఇంగ్లీష్ మీడియంలో బోదించేందుకు నాలుగు వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. వారంతా తమకు అప్పగించిన పాఠశాలలో విధులు నిర్వహిస్తూ విద్యార్థులకు సరైన బోధన చేయాలని సంకల్పించారు. చాలా పాఠశాలలో కనీస సంఖ్యలో విద్యార్థులు లేకపోవడంతో బడిబాట కార్యక్రమం ద్వారా కావాల్సిన సంఖ్యను పెంచాలని సర్కార్ నిర్ణయించింది. జిల్లా విద్యాశాఖాధికారి ఎప్పటికపుడు పర్యవేక్షించాలని భావించినప్పటికి ఆయన కూడ నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. విద్యార్థులు లేక వందల సంఖ్యలో పాఠశాలలో మూతపడే ప్రమాదాలు ఏర్పడుతున్నాయి. సర్కార్ బడులలో మధ్యహ్న బోజనంతో పాటు మౌళిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తున్నప్పటికి అది వృథాగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.
ఏజెన్సీ బడులలో అధ్వాన్న పరిస్థితులు
వరంగల్ జిల్లాలోని ఏజెన్సీ పాఠశాలలో అధ్వాన్న పరిస్థితులు నెలకొన్నాయి. ఐటిడిఏ సమావేశంలో కడియం శ్రీహరి స్వయంగా పాల్గొని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అర్బన్ ప్రాంతాలలో విద్యార్థుల తల్లితండ్రులు ప్రైవేట్ పాఠశాలల వైపు చూస్తుంటే అటవీ గ్రామాలలో ప్రభుత్వ పాఠశాలలకే పంపించేందుకు సిద్దమవుతున్నారు.
ఇక్కడ ఉపాధ్యాయుల తీరు సరిగా లేకపోవడంతో ఎక్కువగా డ్రాపౌట్స ఉంటున్నాయి. ఓ వైపు సరైన సమయంలో విధులకు హజరుకాకపోవడం, మరో వైపు ఉన్న సమయంలో కూడ సరైన విద్యాబోధన చేయకపోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. వాస్తవంగా ఈ పరిస్థితులను అధ్యయనం చేసిన డిప్యూటి సిఎం రెండు నెలలో పరిస్థితులు మారాలని సంకల్పిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు కొలిక్కి వస్తాయో తెలియాలంటే మరి కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa