నల్గొండ జిల్లాలో ఫ్లోరైడ్ పీడిత, కరువు పీడిత ప్రాంతాల తాగు, సాగునీటి కోసం ఉదయ సముద్రం ప్రాజెక్టును యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నట్టు ఇరిగేషన్ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. నకిరేకల్, మునుగోడు, నల్గొండ అసెంబ్లీ నియోజక వర్గాల ప్రజలు, రైతులకు దీంతో ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. ఎట్టి పరిస్థితులల్లోనూ ఈ ప్రాజెక్టును డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని ఇరిగేషన్ అధికారులు, ఏజెన్సీ ప్రతినిధులను ఆయన ఆదేశించారు. జనవరిలో బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ లో నీరు పడాలని హరీశ్ రావు స్పష్టం చేశారు. 6.9 కిలోమీటర్ల అప్రోచ్ కెనాల్ పూర్తయిందని, టన్నెల్ పనులు చివరి దశలో ఉన్నట్టు చెప్పారు.
ఇవాళ ఉదయం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్ రెడ్డి, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సీఈ ఎస్.సునీల్ లతో కలిసి ఉదయ సముద్రం పనులను మంత్రి హరీశ్ రావు మెరుపు తనిఖీ చేశారు. 92 మీటర్ల లోతున నిర్మిస్తున్న సర్జ్ పూల్ లోనికి వెళ్ళి స్వయంగా పనులను పరిశీలించారు. తరువాత బ్రాహ్మణ వెల్లంల రిజర్వాయర్ ను మంత్రి సందర్శించారు. ఉదయ సముద్రం ప్రాజెక్టు సైటు దగ్గర ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.