డెంగీ వ్యాధిని నయం చేయడానికి ఉపయోగించే నీలవెంబు వైద్యం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విలక్షణ నటుడు కమల్హాసన్పై తమిళనాడు ఆరోగ్య శాఖ మంత్రి విజయభాస్కర్ మండిపడ్డారు. కమల్ శాస్త్రవేత్త కాదని, నీలవెంబు వైద్యం గురించి మాట్లాడే హక్కు, అర్హత ఆయనకు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. కమల్ లాంటి నటుడు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని మంత్రి పేర్కొన్నారు. ప్రజలు భయాందోళనకు గురి కాకూడదనే తాను బుధవారం ట్వీట్ చేశానని తెలిపారు. దీనిపై మీడియాతో మాట్లాడిన కమల్హాసన్.. తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. ఎలాంటి వైద్య సలహాలు లేకుండా ఆయుర్వేద మందులు వాడటం సరికాదని మాత్రమే తాను చెప్పానని స్పష్టం చేశారు.
రాజకీయాల్లోకి ప్రవేశిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత కమల్హాసన్ తరుచూ వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కుతున్నారు. ఇటీవల పెద్దనోట్ల రద్దు నిర్ణయానికి తొందరపడి మద్దతు తెలిపానంటూ ప్రజలకు క్షమాపణ చెప్పడం చర్చనీయాంశమైంది.