న్యూఢిల్లీ: షాపింగ్ మాల్స్పై రిటైల్ మార్కెటీర్లలో ఆసక్తి పెరుగుతున్నది. మాల్స్లో రిటైల్ స్పేస్ లీజులు గణనీయంగా పెరుగుతున్నాయి మరి. గత తొమ్మిది నెలల్లో ఏకంగా 55 శాతం ఎగబాకాయి. హైదరాబాద్సహా దేశంలోని ఎనిమిది మహా నగరాల్లో ఈ ఏడాది జనవరి-సెప్టెంబర్ మధ్య మాల్స్కు డిమాండ్ విపరీతంగా పెరిగిందని, సుమారు 23 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో లీజింగ్ కార్యకలాపాలు జరిగాయని ప్రాపర్టీ కన్సల్టెంట్ కుష్మన్ అండ్ వేక్ఫీల్డ్ గణాంకాలు చెబుతున్నాయి. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, ముంబై, కోల్కతా, పుణె, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్లలో కుష్మన్ సర్వే జరిగింది.
చెన్నైలో అత్యధికంగా 3,11,088 చదరపు అడుగుల మేర లీజులు జరుగగా, నిరుడు జనవరి-సెప్టెంబర్లో ఇది కేవలం 85,857 చదరపు అడుగులుగానే ఉన్నది. ఇక చెన్నై తర్వాత హైదరాబాద్లోనే మాల్స్కు అమితాదరణ కనిపించింది. ఈసారి 3 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణానికి డిమాండ్ ఏర్పడింది. కాగా, గతంతో పోల్చితే బెంగళూరులో 70 శాతం, కోల్కతాలో 55 శాతం, ఢిల్లీ-ఎన్సీఆర్లో 31 శాతం, ముంబై 5 శాతం మేర మాల్స్లో రిటైల్ స్పేస్ లీజింగ్ జరిగింది. 2020కల్లా హైదరాబాద్లో గరిష్ఠంగా మరో 11 మాల్స్ రావచ్చని కుష్మన్ అంచనా వేసింది.