ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ కార్యకర్తలు, హార్దిక్ అనుచరుల కొట్లాట

Telangana Telugu |  Suryaa Desk  | Published : Mon, Nov 20, 2017, 09:42 AM

రెండు దశాబ్దాలుగా గుజరాత్‌లో అధికారం పీఠంపై ఉన్న భారతీయ జనతా పార్టీని ఎలాగైనా ఓడించాలని కాంగ్రెస్ పట్టుదలతో ఉంది. దీంతో తమకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతున్న పటేళ్లను అక్కున చేర్చుకుంది. అధికారంలోకి వస్తే ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తామనే హామీతో కాంగ్రెస్‌కు పటేళ్ల రిజర్వేషన్ల ఉద్యమ నేత హార్దిక్ పటేల్ మద్దతు ప్రకటించారు. అయితే ఆదిలోనే ఇరు వర్గాల మధ్య సీట్ల పంపకంలో వివాదం తలెత్తింది. ఆదివారం విడుదల చేసిన జాబితాలో తమకు కేవలం మూడు స్థానాలను కేటాయించడంపై పటేళ్లు ఆందోళన చేపట్టారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసి పాటీదార్లు సూరత్‌లో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు.


ఈ కార్యక్రమానికి భారీగా చేరుకున్న పటేళ్లు, కాంగ్రెస్ కార్యకర్తలు మధ్య చోటుచేసుకున్న వాగ్వాదం చినిచినికి గాలివానగా కొట్లాటకు దారితీసింది. తమకు టిక్కెట్ల కేటాయింపుల్లో అన్యాయం జరిగిందని, దీనికి వ్యతిరేకంగా సోమవారం ఆందోళనలు నిర్వహిస్తామని, కాంగ్రెస్‌కు మద్దతు విషయంలో పునరాలోచిస్తామని పాటీదార్ నేత దినేశ్ పటేల్ వ్యాఖ్యానించాడు. 182 స్థానాలున్న గుజరాత్ అసెంబ్లీలో తమకు 20 స్థానాలు కేటాయించాలని పటేళ్లు కోరుతుండగా, ఓబీసీ నేత అల్ఫేస్ ఠాకూర్ 12 స్థానాలు కావాలని అడుగుతున్నారు. ఈ ఒప్పందంతోనే తాము కాంగ్రెస్‌కు మద్దతు ఇచ్చినట్లు వారు పేర్కొంటున్నారు.


ఇరువర్గాల మధ్య అవగాహన కుదిరిందని, రిజర్వేషన్ల అంశంపై అధికారికంగా ప్రకటించాల్సి ఉందని, సోమవారం రాజ్‌కోట్‌లో జరిగే ప్రచార సభకు పటేళ్లు వస్తారని కాంగ్రెస్ భావిస్తోంది. కానీ అనూహ్యంగా అహ్మదాబాద్‌‌లో గుజరాత్ పీసీసీ అధ్యక్షుడు భరత్‌సిన్హా సోలంకి నివాసం ఎదుట ఆందోళన చేస్తోన్న పాటీదార్లపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడిచేయడంతో పోలీసులు ఇరు వర్గాలను చెదరగొట్టారు. పీసీసీ అధ్యక్షుడిని కలుసుకోడానికి వెళితే గంటల కొద్దీ వేచిచూశామని, తమ సభ్యుల పేర్లను వెళ్లడించాలని డిమాండ్ చేస్తే పోలీసులతో అరెస్ట్ చేయించారని దినేశ్ పాటిల్ ఆరోపించారు


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com