హైదరాబాద్ : నగరంలో జీహెచ్ఎంసీ, జైళ్ల శాఖ చేపట్టిన బెగ్గర్ ఫ్రీ సిటీ కార్యక్రమంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూస్తున్నాయి. భిక్షాటన చేసే వారిని చంచల్గూడ, చర్లపల్లి జైళ్లలోని ఆనంద్ ఆశ్రమాలకు తరలించి.. వారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ క్రమంలో ఓ ఇద్దరి మహిళల కథ ఆశ్చర్యపరిచింది. ఒకరు అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్ అయితే.. మరొకరు కోటిశ్వర్లు. వీరిద్దరిది కన్నీటి గాథ వింటే చలించిపోవాల్సిందే. హైదరాబాద్ ఆనంద్బాగ్లో నివాసముండే ఫర్జానా(50) ఎంబీఏ చదివింది. ఒకప్పుడు లండన్లో అకౌంట్స్ అధికారిణిగా పని చేసింది. రెండేళ్ల క్రితం ఆమె భర్త చనిపోవడంతో కుమారుడి దగ్గర ఉంటోంది. కుమారుడు వృత్తి రీత్యా ఆర్కిటెక్చర్. ఇటీవలే ఫర్జానా అనారోగ్యానికి గురైంది. రోగం తగ్గాలంటే దయ ఉండాలని తల్లికి కుమారుడు సూచించాడు. అందుకు భిక్షాటన చేయాలని తల్లికి చెప్పాడు కుమారుడు. దీంతో ఏమి చేసేది లేక ఫర్జానా.. లంగర్హౌజ్లోని ఓ దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈ నెల 11న ఆవిడను చర్లపల్లి జైలులోని ఆనంద్ ఆశ్రమానికి తీసుకువచ్చి ఆమె వివరాలు తెలుసుకుని జైలు అధికారులు ఆశ్చర్య పోయారు. ఈవిడ చాలా చక్కగా ఇంగ్లీష్ మాట్లాడడమే కాదు.. హిందీ, ఉర్దూతో పాటు పలు భాషల్లో మంచి ప్రావీణ్యం ఉంది. తల్లిని వదిలించుకోవడం కోసమే భిక్షాటన నాటకం ఆడాడని అధికారులు భావించారు. మొత్తానికి కుమారుడిని పిలిపించి.. ఫర్జానాను ఇంటికి పంపించారు. రబియా బసీరా జీవితంలోకి తొంగి చూస్తే.. ఈవిడ అమెరికా గ్రీన్ కార్డు హోల్డర్. అక్కడ టీచర్గా కూడా పని చేసింది. నగరంలో కోట్ల ఆస్తి ఉంది. కొన్ని ఏండ్ల క్రితం భర్త చనిపోవడంతో.. కూతురుతో ఉండేది. కూతురు కూడా మృతి చెందింది. కుమారులు పట్టించుకోవడం లేదు. కూతురు పిల్లలను ఈవిడ వద్దనే వదిలేసి.. అల్లుడు వెళ్లిపోయాడు. రబియాకున్న కోట్ల ఆస్తిని బంధువులు లాగేసుకున్నారు. మనువళ్ల పోషణ ఆవిడకు భారంగా మారింది. దిక్కుతోచని స్థితిలో షేక్పేట దర్గా వద్ద భిక్షాటన చేస్తోంది. ఈవిడ కూడా ఇంగ్లీష్ చక్కగా మాట్లాడుతుంది. మనువళ్ల మీద బెంగ పెట్టుకున్న రబియా పరిస్థితిని చూసి జైలు అధికారులు కన్నీరు పెట్టుకున్నారు. మొత్తానికి రబీయా బంధువులను పిలిపించి.. రబియాను మంచిగా చూసుకుంటామనే ఆఫిడవిట్ రాయించి ఆవిడను ఇంటికి పంపించారు జైలు అధికారులు.