హైదరాబాద్: ఎన్ఐఆర్డీలో హస్తకళల ప్రదర్శన నేటి నుంచి ప్రారంభం కానుంది. జాతీయ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి సంస్థ వ్యవస్థాపక మాసం సందర్భంగా నవంబర్ 30 నుంచి డిసెంబర్ 4వ తేదీ వరకు రాజేంద్రనగర్లో 15వ గ్రామీణ సాంకేతిక హస్తకళల ప్రదర్శన నిర్వహిస్తున్నట్టు ఎన్ఐఆర్డీ ఆర్థిక సలహాదారు, డైరెక్టర్ చందా పండిట్ తెలిపారు. ఈ ప్రదర్శనను ఈ సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి ప్రారంభించనున్నారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి గ్రామీణ సాంకేతిక హస్తకళల ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు చెప్పారు. ఈ ప్రదర్శనకు 18 రాష్ట్రాలకు చెందిన 250 స్టాళ్లు ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల ప్రజలను అభివృద్ధిపథంలో పయనింపజేయడమే ఎన్ఐఆర్డీ ముఖ్య ఉద్దేశమన్నారు. అందులో భాగంగానే కాలుష్యరహిత గృహ నిర్మాణ పరిజ్ఞానం, వివిధ గ్రామీణ వస్తువుల ప్రదర్శన, అమ్మకాలు, సౌరశక్తి వినియోగం, మట్టిలేకుండా మొక్కలను పెంచే పద్ధతి, గ్రామీణ హస్తకళలు, చేనేతతోపాటు ముఖాముఖి చర్చలు, సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. పర్యావరణానికి ముప్పు కలిగించని వాటికే ఎక్కువగా ఈ స్టాళ్లలో ప్రాధాన్యం ఇస్తున్నామన్నారు. స్వచ్ఛభారత్లో భాగంగా ఈ క్యాంపస్లో చేసిన పలు ప్రయోగాలను ఒక పుస్తకరూపంలో విడుదల చేస్తామన్నారు. గ్రామీణ సాంకేతిక హస్తకళల ప్రదర్శన కార్యక్రమంలో డీడీజీకేవై పథకం కింద ఎన్ఐఆర్డీ సంస్థల్లో శిక్షణ పొందిన అభ్యర్థులతో 17 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.