కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ సోమవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఆయన అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారిలో.. ప్రస్తుత అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సహా పలువురు సీనియర్ నేతలుంటారు. సోనియా తదితరులు వెంటరాగా.. రాహుల్ నామినేషన్లు వేస్తారు. ఈ పత్రాల దాఖలుకు గడువు సోమవారం ముగుస్తుంది. రాహుల్ దాఖలు చేసే నాలుగు నామినేషన్లలో ఒక దానిలో సోనియా మొదటి ప్రతిపాదకురాలిగా ఉంటారని పార్టీవర్గాలు తెలిపాయి. మరోపత్రంలో మన్మోహన్ ప్రతిపాదకుడిగా ఉంటారు.
రాహుల్ గాంధీకి మద్దతుగా పార్టీ ప్రధాన కార్యదర్శులు, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సభ్యులు, రాష్ట్ర విభాగాల నుంచి 75కుపైగా నామినేషన్ ఫారాలు దాఖలవుతాయి. సోనియా, మన్మోహన్తోపాటు పార్టీ సీనియర్ నేతలు గులాం నబీ ఆజాద్, ఎ.కె.ఆంటోనీ, పి.చిదంబరం, సుశీల్ కుమార్ షిండే, అహ్మద్ పటేల్, పార్టీ ముఖ్యమంత్రులు ప్రతిపాదకులుగా సంతకాలు చేస్తారు. ఆదివారం సాయంత్రం వరకూ ఎవరూ నామినేషన్లు వేయలేదని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్ ఎం.రామచంద్రన్ తెలిపారు. 90 నామినేషన్ పత్రాలను రాష్ట్ర విభాగాలకు పంపామన్నారు. రాహుల్ మినహా ఎవరూ కాంగ్రెస్ అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం కనపడటంలేదు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయమే. నామినేషన్ల పరిశీలన కార్యక్రమం మంగళవారం జరుగుతుంది. అదే రోజు సాయంత్రం 3.30గంటలకు.. చెల్లుబాటయ్యే నామినేషన్ల వివరాలను వెల్లడిస్తారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 11 వరకూ గడువు ఉంది. అవసరమైతే పోలింగ్ 16న, ఓట్ల లెక్కింపు 19న జరుగుతుంది.