బ్యాంకులకు వేలకోట్ల రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన వ్యాపారవేత్త విజయ్మాల్యాను తిరిగి స్వదేశానికి రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా మాల్యాను భారత్కు అప్పగించడంపై లండన్లో నేటి నుంచి విచారణ ప్రారంభమైంది. ఈ విచారణకు హాజరయ్యేందుకు సీబీఐ బృందం కూడా లండన్ వెళ్లింది. ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థాన నేతృత్వంలోని సీబీఐ బృందం అక్కడికి చేరుకుంది.
ఈ రోజు ప్రారంభమైన విచారణ.. ఈనెల 5, 6, 7, 11, 12, 13, 14వ తేదీల్లో కొనసాగనుంది. వెస్ట్మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ విచారణ జరుగుతోంది. చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుత్నోట్ ఇరు పక్షాల వాదనలు విననున్నారు. భారత ప్రభుత్వం తరఫున బ్రిటన్స్ క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ వాదిస్తోంది.
మాల్యాను భారత్కు అప్పగిస్తే.. ఆయన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని పేర్కొంటూ జైల్లో కల్పించే భద్రతపై ఆయన తరఫు న్యాయవాదులు ప్రధానంగా సందేహాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మాల్యాకు కల్పించే భద్రతను కోర్టుకు ప్రాసిక్యూషన్ వివరించనుంది.
భారత్లో బ్యాంకులకు 9 వేల కోట్ల రూపాయల రుణాలను ఎగ్గొట్టి లండన్ పారిపోయిన విజయ్మాల్యాను స్కాట్లాండ్ పోలీసులు గతంలో అరెస్టు చేశారు. అయితే నిమిషాల వ్యవధిలోనే మాల్యా 6.5 లక్షల పౌండ్ల బెయిల్ బాండ్పై బయటకు వచ్చారు.
భారత్, యూకే మధ్య 1992 నుంచి నేరస్థుల అప్పగింత ఒప్పందం ఉంది. అయితే ఈ ఒప్పందం ప్రకారం ఇప్పటి వరకూ ఒక్కరిని మాత్రమే భారత్కు అప్పగించింది. 2002 గోద్రా అనంతర అల్లర్ల కేసులో సమీర్భాయ్ వినుభాయ్ పటేల్ను భారత్ తిరిగి స్వదేశానికి రప్పించగలిగింది.