బెంగళూరు: మైసూరు రాజకుటుంబానికి వారసుడొచ్చాడు. మైసూరు రాజు యదువీర్ కృష్ణదత్త చామరాజ వడియార్ భార్య త్రిషికా కుమారి బుధవారం రాత్రి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు 3 కిలోల బరువు ఉన్నాడని, ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. దీంతో రాజకుంటుంబం సంతోషంలో మునిగినట్లు వారి సన్నిహిత వర్గాలు వెల్లడించాయి.
అయితే 2016జూన్లో యదువీర్ వివాహం దంగర్పూర్ యువరాణి త్రిషికాతో జరగగా, ఈ సంవత్సరం ఆమె గర్భవతిగా దసరా మహోత్సవాల్లో పాల్గొంది. అప్పటినుండే తమ రాజ్యానికి ఎవరు రాబోతున్నారో అని మైసూరువాసులు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చారు. ఇక ఇప్పుడొచ్చిన ఈ వారసుడు మైసూరు రాజ్యానికి 28వ రాజుగా చలామణి అవ్వబోతున్నాడు.
ఇదిలా ఉంటే క్రీ.శ1399నుండి మైసూరును పరిపాలిస్తున్న వడియార్ రాజకుటుంబసభ్యులలో 26వ రాజదంపతులైన శ్రీకంఠదత్త నరసింహరాజ వడియార్, ప్రమోద దేవీ వడియార్ దంపతులకు సంతానం కలగలేదు. దీంతో ప్రమోద దేవీ 2015లో యదువీర్ గోపార్ రాజు అనే వ్యక్తిని దత్తత తీసుకొని సంప్రదాయ కిరీటాన్ని అప్పగించింది. ఆ తరువాత 2016లో యదువీర్కు వివాహం చేసిన విషయం తెలిసిందే.