ప్రాజెక్టుల నిర్మాణానికి ఎలాంటి సహకారాన్నైనా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుల నిర్మాణ పనులపై ఏరియల్ సర్వే చేపట్టిన సీఎం తుపాకులగూడెం, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీలను సందర్శించారు. బ్యారేజీ నిర్మాణ పనులను సీఎం పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడానికి తలపెట్టిన సాగునీటి ప్రాజెక్టులను సత్వరం పూర్తిచేయడమే ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని పేర్కొన్నారు. బ్యారేజీలు, పంప్హౌజ్లు, కాల్వల నిర్మాణం ఏకకాలంలో మూడు షిఫ్టుుల్లో పనులు జరగాలని అధికారులు, వర్క్ ఏజెన్సీలను సీఎం ఆదేశించారు. ప్రాజెక్టులకు అవసరమైన రోడ్ల నిర్మాణాన్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రాజెక్టులు పూర్తిచేయడమే చాలా ముఖ్యమైన కార్యక్రమమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీలు గమనంలో ఉంచుకోవాలని సీఎం తెలిపారు.