హైదరాబాద్ : రాష్ట్రంలో చలి తీవ్రత పెరుగుతున్నది. రాత్రి వేళల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అత్యల్పంగా ఆదిలాబాద్లో 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైనట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఈనెల 9న కోస్తా ఆంధ్రా తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం లేనప్పటికీ వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటాయన్నారు. చలిగాలుల తీవ్రత పెరిగితే కనిష్ఠ ఉష్ణోగ్రతలు మరింతగా పడిపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన కనిష్ఠ ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే.. భద్రాచలంలో 13 డిగ్రీలు, ఖమ్మంలో 14, మెదక్లో 15, హకీంపేట్లో 16, హైదరాబాద్, హన్మకొండ, నల్లగొండ, రామగుండంలో 17 డిగ్రీల చొప్పున కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.