ముస్లిం వర్గీయులను కాంగ్రెస్ పార్టీ తప్పుదోవ పట్టిస్తోందని ప్రధాని నరేంద్రమోదీ విమర్శించారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చి.. వాటిని నెరవేర్చలేదని ఆయన ఆరోపించారు. గుజరాత్లోని రెండో విడత అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన లునవాడ ప్రాంతంలో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలోని ముస్లింలందరికీ కాంగ్రెస్ తప్పుడు హామీలు ఇచ్చి నెరవేర్చలేదన్నారు.
గతంలో కాంగ్రెస్ యువనేత సల్మాన్ నిజామీ చేసిన ట్వీట్పై ఆయన విమర్శలు గుప్పించారు. ‘‘గుజరాత్లో కాంగ్రెస్ తరఫున నిజామి ఎన్నికల ప్రచారం చేశారు. ఆయన గతంలో ట్విటర్ వేదికగా రాహుల్ తండ్రి, నానమ్మ గురించి రాశారు. బాగానే ఉంది. కానీ, ‘మోదీ మీ తల్లిదండ్రులు ఎవరో చెప్పండి?’ అని నన్ను ప్రశ్నించారు. ఇటువంటి భాషను కనీసం శత్రువులు కూడా ఉపయోగించరు’’ అని మోదీ గుర్తు చేశారు. ‘‘నిజామి కశ్మీరీలకు స్వతంత్రం కావాలని అన్నారు. మన దేశ సైన్యాన్ని రేపిస్టులని సంబోధించారు. ఇటువంటి వ్యక్తులను ప్రజలు ఎలా అంగీకరిస్తారు. ప్రతి ఒక్క ఇంట్లోనూ అఫ్జల్ ఉంటారని నిజామి గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు’’ అంటూ మోదీ మండిపడ్డారు.