రాంచీ: ఝార్ఖండ్లో గిరిజన జంటలకు ఓ ఎమ్మెల్యే ముద్దుల పోటీపెట్టారు. అంతేకాదు ఆధునికవాదం, ప్రేమ లాంటి భావనలను ప్రోత్సహించేందుకే దీన్ని నిర్వహించానంటూ ఈ తంతును ఆయన వెనకేసుకొచ్చారు. లిట్టిపారాలోని తాల్పహరీ గ్రామంలో శనివారం రాత్రి ఝార్ఖండ్ ముక్తి మోర్చా(జేఎంఎం) ఎమ్మెల్యే సైమన్ మరాండీ ఈ వివాదానికి తెరతీశారు. గిరిజన జంటలకు ముద్దుల పోటీ నిర్వహించడంతోపాటు.. అవార్డులనూ ఆయన అందించారు. కార్యక్రమానికి వందల మంది ప్రజలు, పార్టీ నేతలు హాజరయ్యారు. ఈ వార్తను చిత్రాలతోసహా సోమవారం స్థానిక పత్రికలు ప్రచురించాయి. దీంతో ఒకరినొకరు అర్థంచేసుకోవడానికి, విడాకులను తగ్గించడానికి ఈ పోటీ తోడ్పడుతుందంటూ సైమన్ తన చర్యలను సమర్థించుకున్నారు. ‘ఓ ఎమ్మెల్యే అసెంబ్లీలో బార్ తెరవమంటారు. మరో ఎమ్మెల్యే ముద్దుల పోటీలు పెడతారు. అసలు జేఎంఎం ఇలాంటి చర్యలతో ఏం చెప్పాలనుకుంటోంది’అంటూ భాజపా నేత రమేశ్ పుష్కర్ విమర్శలు సంధించారు.