నేపాల్ పార్లమెంట్, ప్రావిన్షియల్ అసెంబ్లీ ఎన్నికల్లో కమ్యూనిస్టుల కూటమికి స్పష్టమైన మెజారిటీ లభించింది. యుఎంఎల్, మావోయిస్టు సెంటర్లతో కూడిన కూటమి తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. ఈ ఎన్నికల కోసం మాజీ ప్రధాని కె.పి.ఓలి నేతృత్వంలోని సిపిఎన్-యుఎంఎల్, మాజీ ప్రధాని ప్రచండ నేతృత్వంలోని సిపిఎన్-మావోయిస్టు సెంటర్ ఎన్నికల పొత్తు కుదుర్చుకున్నాయి. సోమవారం ఎన్నికల కమిషన్ ప్రకటించిన ఫలితాల ప్రకారం, మొత్తం 165సీట్లలో యుఎంఎల్ 74సీట్లు గెలుచుకోగా, మావోయిస్టు సెంటర్ 32 సీట్లను గెలుచుకుంది. గత ఎన్నికల్లో ఏకైక పెద్ద పార్టీగా అవిర్భవించిన పాలక నేపాలీ కాంగ్రెస్ కేవలం 26సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. వామపక్ష కూటమికి స్పష్టమైన మెజారిటీ వచ్చిన నేపథ్యంలో ఓలి తదుపరి ప్రధానిగా ఎన్నికవుతారని భావిస్తున్నారు. ఝాపా-5 నియోజకవర్గం నుండి ఓలి 28వేలకు పైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో ఏ అభ్యర్థికీ రానంత ఎక్కువగా ఓలికి 57,139ఓట్లు పోలయ్యాయి. రెండు మాదేషీ పార్టీలైన ఫెడరల్ సోషలిస్టు పార్టీ నేపాల్, రాష్ట్రీయ జనతా పార్టీలు చెరో 11 సీట్లను గెలుచుకున్నాయి. మాజీ ప్రధాని బాబురామ్ భట్టారారు నేతృత్వంలోని నయా శక్తి పార్టీ, రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ, మరో ఇండిపెండెంట్ అభ్యర్థి ఒక్కో సీటును గెలుచుకున్నాయి. మరో 110 సీట్లకు దామాషా ఓటింగ్ కింద పోలైన ఓట్ల లెక్కింపు ఇంకా సాగుతోంది. ఈ దామాషా ఓటింగ్లో నేపాలీ కాంగ్రెస్కి మెరుగైన ఫలితాలు రావచ్చని ఆశిస్తున్నారు. దామాషా ఓటింగ్ వ్యవస్థలో పూర్తిగా ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత మొత్తంగా తుది ఫలితాలు వెలువడుతాయని భావిస్తున్నారు.