ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆలయాలకు వెళ్లడం తప్పా : రాహుల్ గాంధీ

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 12, 2017, 02:46 PM

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత మొదటిసారి రాహుల్ గాంధీ ఇవాళ పత్రికాసమావేశంలో మాట్లాడారు. గుజరాత్ రెండవ దశ ఎన్నికల ప్రచారంలో ఉన్న ఆయన మీడియాతో మాట్లాడుతూ మోదీ, రూపానీ ప్రభుత్వాలపై విరుచుకుపడ్డారు. గత 22 ఏండ్లుగా గుజరాత్‌లో వన్‌సైడ్ డెవలప్‌మెంట్ జరిగిందని ఆరోపించారు. కేవలం కొద్ది మందికి మాత్రమే లాభం చేకూరిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ హక్కులు దక్కలేదన్నారు. 4 నెలల క్రితమే తాము ఎన్నికల ప్రచారం ప్రారంభించామని, సమాజంలో అన్ని వర్గాల ప్రజలను కలిశామని, ప్రతి ఒక్క వర్గం కోసం తమ పార్టీ ఓ ప్రత్యేక విజన్‌ను తయారు చేసిందని రాహుల్ అన్నారు.


ఎన్నికల ప్రచార సమయంలో బీజేపీ తన హుందాతనాన్ని నిలుపుకోలేకపోయిందన్నారు. అవినీతి, రైతుల గురించి ప్రధాని మాట్లాడడం వదిలేశారని, తన గురించే తానే మాట్లాడుకుంటున్నారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశారు. మొదటి దశ పోలింగ్‌ను గమనించిన తర్వాత తాము ఈ విషయాన్ని వెల్లడిస్తున్నట్లు కాంగ్రెస్ నేత తెలిపారు. ఆలయాలను సందర్శించడం తప్పుకాదు అని, ప్రతి గుడిలోనూ ప్రజల ఉజ్వల భవిష్యత్తు కోసం ప్రార్థించానని, ఆలయాలకు వెళ్తే నష్టం ఏముందని, తాను కేదారినాథ్‌ను కూడా విజిట్ చేసినట్లు రాహుల్ తెలిపారు. గుజరాత్ గురించి ఏ నిర్ణయం తీసుకున్నా, అది ప్రజలతో చర్చించాకే తీసుకుంటామన్నారు. గుజరాత్ ప్రజల మనోభావాలను వింటామని, ఏ నిర్ణయాన్ని కూడా ఏకపక్షంగా తీసుకోమన్నారు. గుజరాత్‌లో బీజేపీ కొంత ఆందోళన చెందుతున్నదని, ఇది అందరికీ తెలుసు అని, ఈ సారి ఫలితాలు అసాధారణంగా ఉంటాయని, బీజేపీ భయపడుతున్నదని, ఈ ఎన్నికల్లో పూర్తి సామర్థ్యంతో బీజేపీ పోటీ చేస్తుందని అనుకున్నానని, కానీ ఆ పార్టీ అలా చేయలేకపోయిందని రాహుల్ అన్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ గురించి మోదీ ఎందుకు అలా మాట్లాడారో అర్థం కావడం లేదన్నారు. మన్మోహన్ గురించి మోదీ మాట్లాడిన తీరు సహించరానిదన్నారు. మణి శంకర్ అయ్యర్‌పై తాను ఓ నిర్ణయాన్ని తీసుకున్నానని, మోదీ ఈ దేశ ప్రధాని అని, కానీ మాజీ ప్రధాని మన్మోహన్‌పై ఆయన చేసిన ఆరోపణలు అర్థరహితమన్నారు. గ‌త మూడు నెల‌లుగా గుజ‌రాత్ ప్ర‌జ‌లు త‌న‌కు ప్రేమాభిమానాలు పంచార‌ని, ఈ అనుభ‌వాన్ని తానెప్పుడూ మ‌రిచిపోలేన‌న్నారు. ఇక త‌న ల‌క్ష్యం.. కాంగ్రెస్ పార్టీని బ‌లోపేతం చేయ‌డ‌మే అని, రాజ‌కీయ క్షేత్రాన్ని స‌మూలంగా మార్చాల‌న్న ఉద్దేశంతో తాను ఉన్న‌ట్లు రాహుల్ తెలిపారు. రాజ‌కీయాలు దారుణంగా, నీచంగా త‌యారు అయ్యాయ‌ని, వాటిని మార్చేస్తాన‌ని రాహుల్ అన్నారు. గుజ‌రాత్‌లో త‌న నిర్ణ‌యాలేంటో మీరే చూస్తార‌ని కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ స్ప‌ష్టం చేశారు. మోదీ సీ ప్లేన్‌లో ప్ర‌యాణించ‌డం త‌ప్పు కాదు అని, కానీ అది రాజ‌కీయంగా ఓ స్టంట్ మాత్ర‌మే అని అన్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com