టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ, యువ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య మధ్య పరుగు పందెం పెడితే ఎవరు నెగ్గుతారు? 36 ఏళ్ల ధోనీ, 24 ఏళ్ల పాండ్య మధ్య వంద మీటర్ల రన్నింగ్ రేసు పెడితే.. హార్దిక్నే విజయం వరిస్తుందని భావిస్తాం కదూ. కానీ మహేంద్ర సింగ్ ధోనీ ఇప్పటికీ ఎంత ఫిట్గా ఉన్నాడో చాటిచెప్పేలా.. బీసీసీఐ ట్విట్టర్ ద్వారా ఓ వీడియోను పోస్ట్ చేసింది. దిగ్గజ క్రికెటర్, యంగ్ ప్లేయర్ మధ్య రన్నింగ్ రేసును మన కళ్ల ముందు ఉంచింది.
రెండో వన్డే ప్రారంభానికి ముందు వార్మప్ సెషన్లో పాల్గొన్న ధోనీ, పాండ్య మైదానంలో వంద మీటర్ల పరుగు పందెంలో పాల్గొన్నారు. సరదాగా రన్నింగ్ మొదలుపెట్టిన వీరు.. తర్వాత సీరియస్గా తీసుకున్నారు. వీరిద్దరూ చిరుతల్లా పరిగెత్తి.. ఉసేన్ బోల్ట్ను మైమరిపించారు. ఇద్దరూ సమానంగా పరిగెత్తినప్పటికీ.. చివర్లో పాండ్య అలసిపోయినట్లు కనిపించాడు. కానీ ధోనీ మాత్రం ఆఖరి వరకూ ఒకే వేగంతో రన్నింగ్ చేయడం ఆశ్చర్యం కలిగించింది. తన కంటే 12 ఏళ్లు చిన్నవాడైన పాండ్యను ఓడించిన ధోనీ.. ఈ వయసులోనూ సత్తా తగ్గలేదని మరోసారి ఫ్రూవ్ చేసుకున్నాడు.