జయశంకర్ భూపాలపల్లి : భూపాలపల్లిని ఓడీఎఫ్ గా ప్రకటింపజేసేందుకు చేస్తున్న కృషి అభినందనీయమని స్పీకర్ మధుసూదనాచారి అన్నారు. రేగొండ ఎంపీడీవో కార్యాలయంలో బహిరంగ మలవిసర్జన పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సుకు స్పీకర్ మధుసూదనాచారి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సదస్సులో స్పీకర్ మాట్లాడుతూ ప్రపంచంలో 220 దేశాలకు గాను 150 దేశాల్లో బహిరంగ మలవిసర్జన లేదన్నారు. భారత దేశంలో అతి తక్కువగా మరుగుదొడ్లు నిర్మించుకున్న ప్రాంతాల్లో భూపాలపల్లి ఒకటని చెప్పారు. నిన్నటి వరకు పాలించిన ప్రభుత్వాలు ఓడీఎఫ్ ను ఒక సమస్యగా గుర్తించ లేదని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాలను ఓడిఫ్ గా తయారుచేయాలనే నిర్ణయాన్ని తీసుకున్న ప్రధాని మోడీ, సీఎం కేసీఆర్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఏ ఆత్మ విశ్వాసంతో తెలంగాణ సాదించామో అంతే ఆత్మ విశ్వాసంతో ఓడీఎఫ్ గా ప్రకటించగలమని స్పీకర్ ధీమా వ్యక్తం చేశారు. మనిషికి చిత్తశుద్ధి ఉంటే ఏదయినా సాధించగలమన్నారు. భూపాలపల్లిని ఒక మోడల్ నియోజకవర్గంగా తయారు చేసేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. బహిరంగ మలవిసర్జన లేని గ్రామాలకు 10 లక్షల రూపాయల అభివృధ్ధి నిధులను స్పీకర్ ప్రకటించారు. అనంతరం ఓడిఎఫ్ లో భాగంగా మంచి సర్వీస్ చేసిన ఉద్యోగులను స్పీకర్ శాలువతో సత్కరించారు. ఈ సదస్సులో జిల్లా కలెక్టర్ మురళి, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.