మొహాలీః వన్డేల్లో తొలి డబుల్ సెంచరీ నమోదైంది 2010, ఫిబ్రవరి 24న. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ ఘనత సాధించాడు. అంటే వన్డే క్రికెట్ మొదలైన సుమారు 40 ఏళ్ల తర్వాతగానీ ఇది సాధ్యం కాలేదు. కానీ ఆ తర్వాత ఏడేళ్లలోనే మొత్తం ఏడు డబుల్ సెంచరీలు నమోదయ్యాయి. అందులో మూడు ఒకే ఒక్కడు రోహిత్ శర్మ సాధించాడు. వన్డేల్లో మారథాన్ ఇన్నింగ్స్ ఆడే అలవాటున్న రోహిత్.. మరోసారి తన స్టామినా చూపించాడు. ఈ వన్డేకు ముందే రెండు డబుల్ సెంచరీలతో చరిత్ర సృష్టించిన ఘనత రోహిత్ పేరిట ఉంది. దానిని మరింత మెరుగు పరచుకున్నాడతడు. అంతేకాదు ఇవాళ రోహిత్ పెళ్లి రోజు కూడా కావడం ఈ చారిత్రాత్మక ఇన్నింగ్స్ను మరింత మధురంగా మార్చింది. ఈ మ్యాచ్ చూడటానికి రోహిత్ భార్య రితిక స్టేడియానికి వచ్చింది. లంక బౌలర్లను తన భర్త ఉతికి ఆరేస్తుంటే.. ఆమె తెగ సంబరపడిపోయింది. చివరికి అతను డబుల్ సెంచరీ చేయగానే భావోద్వేగానికి లోనైంది. తన భర్తను అభినందిస్తూనే ఆమె కంటతడి పెట్టింది. ఈ మ్యాచ్లో రోహిత్ కేవలం 153 బాల్స్లోనే 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. రితికను 2015, డిసెంబర్ 13న పెళ్లి చేసుకున్నాడు రోహిత్. ఆమె అతనికి చిన్ననాటి స్నేహితురాలు. రితిక ప్రస్తుతం రోహిత్కు స్పోర్ట్స్ మేనేజర్గానూ ఉన్నది.