హైదరాబాద్: మన భూభాగం నుంచి అంతరిక్షంలో పరిభ్రమించే ఉపగ్రహాలు రోజుకు రెండుమూడు సార్లకు మించి కనబడవు. అదే అంటార్కిటికాలోని లార్స్మ్యాన్ హిల్స్ ప్రాంతంలోని భారతి అంటార్కిటికా కేంద్రం నుంచి 10 నుంచి 12 సార్లు కన్పిస్తాయి. అదో అద్భుత అనుభూతి అని ఆ కేంద్రంలో ఏడాదిపాటు విధులు నిర్వహించి శుక్రవారం హైదరాబాద్ చేరుకున్న ముగ్గురు శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. ఆ బృందానికి శంషాబాద్ విమానాశ్రయంలో శుక్రవారం ఘనస్వాగతం లభించింది. ఆ బృందంలో మంగళమణి, శ్రీకాంత్ బల్లా తెలుగువారు కాగా..సత్యేష్ స్వస్థలం గుజరాత్. అంటార్కిటికా సముద్ర పరిశోధన జాతీయ కేంద్రం(ఎన్సీఏఓఆర్), భారత భూగోళశాస్త్ర మంత్రిత్వశాఖలు సంయుక్తంగా ఆ పరిశోధన కేంద్రానికి నాలుగేళ్లుగా శాస్త్రవేత్తలను పంపిస్తున్నాయి. అందులో భాగంగా ఇస్రోకు చెందిన హైదరాబాద్లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ కేంద్రానికి చెందిన ఈ బృందం గతేడు నవంబరులో అక్కడికి వెళ్లింది.