కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు రాహుల్కు అప్పగించిన సోనియాకు సెల్యూట్ చేశారు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్. ఇవాళ ఏఐసీసీ కార్యాలయంలో జరిగిన రాహుల్ పట్టాభిషేక కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇన్నాళ్లూ పార్టీని ఐక్యంగా నిలిపిన సోనియాకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాహుల్ గాంధీ అంకితభావం, పట్టుదల కొత్త ఉత్సాహాన్ని తెస్తుందని ఆశిస్తున్నట్లు మన్మోహన్ చెప్పారు. రాహుల్ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ కొత్త శిఖరాలను చేరుకుంటుందని భావిస్తున్నానని మాజీ ప్రధాని తెలిపారు. రాజకీయాలు ప్రస్తుతం ప్రమాదకరంగా ఉన్నాయని, ఇలాంటి దశలో రాహుల్ పార్టీ బాధ్యతలు స్వీకరిస్తున్నారని, ఆశాపూరితమైన రాజకీయాలను భయకంపితమైన రాజకీయాలు టేకోవర్ తీసుకునే అవకాశాలున్నాయని, కానీ ఆశాజనితమైన రాజకీయాలకు రాహుల్ ప్రాణం పోస్తారని ఆశిస్తున్నట్లు మన్మోహన్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీకి ఇది చరిత్రాత్మక రోజు అని, తాను భావోద్వేగానికి లోనవుతున్నట్లు మన్మోహన్ తెలిపారు. ప్రధానిగా పదేళ్లు చేశానని, సోనియా మార్గదర్శకంలో అనేక చరిత్రాత్మక నిర్ణయాలు తీసుకున్నామన్నారు. తమ పాలనలో జాతీయ వృద్ధి రేటు 7.8 శాతంగా ఉందన్నారు. 140 మిలియన్ల మంది పేద ప్రజల జీవితాలను మార్చేశామన్నారు.