హైదరాబాద్ : పౌర స్పందనకు మన నగరం కార్యక్రమం చక్కని వేదిక అని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కుత్బుల్లాపూర్ వేదికగా మన నగరం కార్యక్రమానికి కేటీఆర్ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు సర్కిళ్ల నుంచి మన నగరం కార్యక్రమానికి ప్రజలు వచ్చారు. తమ సమస్యలను మంత్రికి, అధికారులకు అక్కడి ప్రజలు విన్నవించారు. ప్రజలు అడిగిన సందేహాలను మంత్రి కేటీఆర్ నివృత్తి చేశారు. హైదరాబాద్ నగరం నాది అనే భావన వచ్చినప్పుడే తప్పకుండా మార్పు వస్తుందని కేటీఆర్ అన్నారు. నగరాభివృద్ధిలో, సుందరీకరణలో, పచ్చదనం పెంచడంలో, పరిశుభ్రతలో ప్రజలందరి భాగస్వామ్యం కావాలని కేటీఆర్ చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్ అభివృద్ధికి ప్రభుత్వం అనేక ప్రణాళికలు రచించిందని కేటీఆర్ తెలిపారు.