పన్నుల ఎగవేతను నిరోధించేందుకు ఇ-వే బిల్లును తప్పనిసరి చేసేందుకు వస్తు, సేవల పన్ను(జీఎస్టీ) మండలి ఆమోదం తెలిపింది. శనివారం ఆర్థికమంత్రి అరుణ్జైట్లీ నేతృత్వంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన 24వ జీఎస్టీ మండలి సమావేశంలో ఈ మేరకు నిర్ణయంతీసుకున్నారు. ఇ-వే బిల్లు వ్యవస్థను జనవరి 15లోపు సిద్ధం చేసి ప్రయోగాత్మక దశ చేపట్టనున్నట్లు కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఫిబ్రవరి 2 నుంచి ఇంటర్-స్టేట్ ఇ-వే బిల్లు అమలు చేయాల్సి ఉండగా.. జూన్ 1 నుంచి ఇంట్రా-స్టేట్ ఇ-వే బిల్లును అమల్లోకి తీసుకురానున్నారు. ఫిబ్రవరి ఒకటి నుంచి ఇ-వే బిల్లు అమలు చేసేందుకు అన్ని రాష్ట్రాలు సిద్ధంగా ఉండాల్సిందిగా ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది.
ప్రస్తుతం కర్ణాటక సహా ఆరు రాష్ట్రాలు ఇ-వే బిల్లు అమలుకు సిద్ధంగా ఉన్నాయి. మరికొన్ని రాష్ట్రాలు ఇ-వే బిల్లులో సవరణలు చేస్తే దాన్ని అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపినట్లు సీనియర్ ప్రభుత్వాధికారి ఒకరు తెలిపారు. జీఎస్టీ చట్టం ప్రకారం రూ.50వేల కన్నా ఎక్కువ విలువైన సరకు రవాణాకు ఇ-వే బిల్లును తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. పన్ను ఎగవేతదారులకు చెక్ పెట్టడమే లక్ష్యంగా ఈ సమావేశం జరిగింది. అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు.. సెప్టెంబరుతో పోలిస్తే రూ.12,000కోట్లు తగ్గడంపై ఈ సమావేశాల్లో చర్చించారు. అంతకు ముందు సమావేశాల్లో ఇ-వే బిల్లు విధానాన్ని జనవరి 1 నుంచి దశలవారీగా.. ఏప్రిల్ 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి తీసుకురావాలని జీఎస్టీ మండలి నిర్ణయించింది. అయితే అక్టోబరులో జీఎస్టీ వసూళ్లు తగ్గడంతో ఇ-వే బిల్లు అమలు తేదీని ముందుకు జరిపింది