సాహిత్యానికి తెలంగాణ పుట్టినిల్లని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణ సాహిత్యాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ప్రపంచ తెలుగు మహాసభలు ఎంతగానో ఉపయోగపడుతాయన్నారు. ప్రపంచ మహాసభల వేదికగా మరుగునపడ్డ తెలంగాణ కవులు, రచయితలను ప్రపంచానికి పరిచయం చేయడమే ప్రభుత్వ ఉద్దేశ్యమన్నారు. రెండో రోజు ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియంలో బృహత్ కవి సమ్మేళన కార్యక్రమం ప్రారంభమైంది. ఈ సమ్మేళనానికి కడియం ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పల్లె పాటలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. వరి నాట్లు వేసేటప్పుడు, వడ్లు దంచేటప్పుడు పాడే పాటు ఇప్పుడు కనుమరుగయ్యాయన్నారు. అలాంటి పాటలను మళ్లీ ప్రజల్లోకి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ తెలుగే అసలు తెలుగు అని ప్రపంచానికి చాటి చెబుదామన్నారు. భాష ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉండాలన్నారు. బృహత్ కవి సమ్మేళనంలో పెద్ద సంఖ్యలో కవులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు కవులను కడియం ఘనంగా సత్కరించారు.