రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ఐ బెగ్గింగ్ అనే పదాన్ని ఉపయోగించొద్దనే విషయాన్ని రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు మరోసారి గుర్తుచేశారు. శుక్రవారం కేంద్రమంత్రి పీపీ చౌదరి సభలో మాట్లాడుతూ ఐ బెగ్ అని పలికారు. వెంటనే ఆయన మంత్రికి బెగ్ అనే పదాన్ని ఉపయోగించొద్దని సూచించారు. కేవలం పత్రాలను ప్రవేశపెడుతున్న విషయాన్ని మాత్రమే ప్రస్తావించాలని బెగ్ అనే పదాన్ని వాడొద్దని సూచించారు. ఆ పదాన్ని ఉపయోగించకపోవడం మంచిదన్నారు. ఆ తర్వాత చౌదరి మాట్లాడేపుడు బెగ్ పదాన్ని ఉపయోగించలేదు. దీనిపై వెంకయ్యనాయుడు హర్షం వ్యక్తం చేశారు.పార్లమెంటు సమావేశాలు ప్రారంభమైన మొదటి రోజు కూడా వెంకయ్యనాయుడు ఇదే సూచన చేశారు. ఇప్పటివరకు రాజ్యసభలో పత్రాలను ప్రవేశపెట్టేటప్పుడు సభ్యులు ఐ బెగ్ టు అని పలికేవారు. అది విన్న ఆయన ఆ పదాన్ని వాడొద్దని సూచించారు. అది వలసవాదానికి నిదర్శనమని, ప్రస్తుతం మనం స్వతంత్ర భారతదేశంలో జీవిస్తున్నామని చెప్పారు.