తెరాస ఎమ్మెల్సీ రాములు నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు రాజకీయ వర్గాలలో ప్రచారం జరుగుతుంది. ఈసాయంత్రమే రాములు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారని ఇప్పటికే అయన తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ కుంతియాను కూడా కలిసారని తెరాసపార్టీలోనే వినిపించింది. దీనిని ధ్రువీకరిస్తూ రాములు నాయక్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు తెరాస ప్రకటించింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని వేటు వేస్తున్నట్లు ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రకటించారు. దీంతో రాములు హస్తం గూటికి చేరడం ఖరారైనట్లయింది. రాములు నాయక్ నారాయణ ఖేడ్ టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారట. అయితే కెసిఆర్ ఆ టిక్కెట్ ను మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికే మరోసారి అవకాశం ఇచ్చారు. దీంతో రాములు పార్టీని వీడనున్నాడని తెరాస అభ్యర్థులను ప్రకటించిన రోజునుండి కథనాలు వచ్చాయి. మొత్తానికి ఈ సాయంత్రంతో రాములు వ్యవహారం కొలిక్కి వచ్చేలా ఉంది.