ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలంగాణలో రాహుల్ ప్రచారం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sat, Oct 20, 2018, 08:57 AM

తెలంగాణలో అధికారం దక్కించుకోవడానికి కాంగ్రెస్ పార్టీ సర్వ శక్తులు ఒడ్డుతోంది. మహా కూటమిగా ఇతర పార్టీలతో జట్టు కట్టేందుకు ఓవైపు చర్చలు జరుపుతోన్న కాంగ్రెస్.. మరోవైపు సొంత ప్రచారంపై దృష్టి సారించింది. నేడు (శనివారం) రాహుల్‌తో ప్రచారానికి హస్తం పార్టీ శ్రీకారం చుడుతోంది. ఏఐసీసీ అధ్యక్షుడు ఒకే రోజు మూడు సభల్లో పాల్గొననున్నారు. ఆదిలాబాద్ జిల్లా భైంసాలో రాహుల్‌తో తొలి సభ నిర్వహించనున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ నుంచి హెలికాఫ్టర్ ద్వారా మధ్యాహ్నం 12.20 గంటలకు ఆయన భైంసా చేరుకుంటారని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. 


మధ్యాహ్నం 12.30 నుంచి 1.30 గంటల మధ్య రాహుల్ గాంధీ భైంసా సభలో పాల్గొంటారు. ఈ సభ ముగిశాక కామారెడ్డి వెళ్తారు. మధ్యాహ్నం 2.30 నుంచి 3.30 గంటల మధ్య కామారెడ్డి సభలో పాల్గొంటారు. తర్వాత హెలికాఫ్టర్‌లో హైదరాబాద్ చేరుకుంటారు. సాయంత్రం 5-6 గంటల మధ్య చార్మినార్ సభలో ప్రసంగిస్తారు. రాత్రి బేగంపేట్ నుంచి ప్రత్యేక విమానంలో రాహుల్ ఢిల్లీ బయల్దేరి వెళ్తారు. 


ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే రాహుల్ సభలను నిర్వహిస్తుండటాన్ని బట్టి.. ముస్లింల ఓట్లపై ఆ పార్టీ కన్నేసిందని అర్థమవుతోంది. తెలంగాణ ఇచ్చినప్పటికీ.. 2014 ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలోని 44 స్థానాలకు గానూ కాంగ్రెస్ పార్టీ కేవలం మూడు సీట్లు మాత్రమే గెలుపొందింది. దీంతో ఈ ప్రాంతంలో బలపడటానికి రాహుల్ సభలు ఉపయోగపడతాయని కాంగ్రెస్ భావిస్తోంది. 


రాహుల్ గాంధీ సభలను విజయవంతం చేయడం కోసం తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. లక్షలాది మందిని తరలించడానికి సన్నాహాలు చేస్తున్నారు. హైదరాబాద్‌లో రాహుల్ చేతుల మీదుగా మాజీ సీఎం రోశయ్యకు రాజీవ్ సద్భావనా అవార్డును అందజేయనున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com