తెలంగాణ రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల కేసీఆర్ పాలనలో 4500 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి విమర్శించారు. ఆ కుటుంబాలను ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా పరామర్శించలేదన్నారు. శనివారం భైంసాలో చేపట్టిన రాహుల్ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాహుల్ దిల్లీ నుంచి వచ్చి 15 కి.మీల పాదయాత్ర చేసి రైతులకు సంఘీభావం తెలిపారన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆదిలాబాద్ జిల్లాలో 10 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచి తీరుతుందని ధీమా వ్యక్తంచేశారు. డిసెంబర్ 12న రాష్ట్రంలో ఏర్పడేది కాంగ్రెస్ ప్రభుత్వమేనన్నారు. ప్రత్యేక రాష్ట్రంతో తమ జీవితాలు బాగుపడతాయని ప్రజలు ఆశించినప్పటికీ.. తెరాస పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం జరిగిందన్నారు. రాబోయే ఎన్నికల్లో తెరాసను ఓడించేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. తమ ప్రభుత్వం ఏర్పాటు కాగానే రైతులకు ఏకకాలంలో రూ.2లక్షలు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చారు.