మైనారిటీల కోసం 200కు పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేశాం. షాదీముబారక్ పథకం ప్రవేశపెట్టి పేద ముస్లింలకు కేసీఆర్ అండగా నిలిచారు. ముస్లింలు పండుగలను ఘనంగా జరుపుకోవడానికి కేసీఆర్ చేయూతనిచ్చారు. కేసీఆర్ను మించిన లౌకికవాది మరొకరు లేరని మంత్రి కేటీఆర్ అన్నారు. మంత్రి కేటీఆర్ సమక్షంలో కాంగ్రెస్ మైనారిటీ నేతలు పలువురు నేడు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. అబిద్ రసూల్ఖాన్, ఖలీల్ ఉర్ రెహమాన్లతో పాటు పెద్దఎత్తున అనుచరులు గులాబీ దళంలో చేరారు. వీరందని పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన మంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకుని టీఆర్ఎస్లో చేరిన వారికి అభినందనలన్నారు. ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఇక్బల్ మీనార్ కట్టించింది కేసీఆరేనన్నారు. వంద సీట్లు గెలిచి కేసీఆర్ మరోసారి సీఎం కాబోతున్నారని తెలిపారు. బీజేపీ, టీఆర్ఎస్ పార్టీల మధ్య సిద్ధాంత పరమైన విరోధం ఉంది. మోదీతో కలిసే ప్రసక్తే లేదని చెప్పారు. టీఆర్ఎస్ 16 ఎంపీ సీట్లను గెలిచి జాతీయ రాజకీయాల్లో కీలకపాత్ర పోషించబోతుందన్నారు. అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు మరిన్ని అభివృద్ధి పథకాలు తీసుకొస్తామని మంత్రి పేర్కొన్నారు.