టీమిండియా ఆటగాళ్లు ఆస్ట్రేలియా పర్యటనకు బయల్దేరారు. ఆతిథ్య జట్టుతో కోహ్లీసేన నాలుగు టెస్టులు, మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనుంది. ఇప్పటి వరకు అక్కడ సిరీస్ గెలవని భారత్ ఈ సారి ఎలాగైనా విజయం సాధించాలని తహతహలాడుతోంది. అందులోనూ ఆసీస్ కీలక ఆటగాళ్లు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లేకపోవడం కలిసొచ్చే అంశం.
ఆస్ట్రేలియాకు బయల్దేరిన సందర్భంగా ఆటగాళ్లు ఆనందం వ్యక్తం చేశారు. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, పేసర్ జస్ప్రీత్ బుమ్రా, యువ ఆటగాడు కృనాల్ పాండ్య తామెంతో ఉత్సాహంగా, ఆత్రుతతో ఉన్నామని పేర్కొన్నారు. ప్రయాణానికి సంబంధించిన చిత్రాలు పంచుకున్నారు. ఆసీస్కు వెళ్లిన వారిలో కృనాల్, బుమ్రా, రోహిత్ శర్మ, మనీశ్ పాండే, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, యజువేంద్ర చాహల్, శిఖర్ ధావన్ ఉన్నారు. ప్రపంచకప్ లోపు మరో 13 వన్డేలు మాత్రమే ఉండటంతో జట్టులో మార్పులు చేయబోమని టీమిండియా కోచ్ రవిశాస్త్రి గురువారం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాను గత ఆసీస్ పర్యటనతో పోలిస్తే ఇప్పుడు ఎంతో పరిణతి సాధించానని కోహ్లీ పేర్కొన్నాడు. ఆసీస్ సిరీస్కు ఎంపికైన కొందరు ఆటగాళ్లు న్యూజిలాండ్-ఏతో టెస్టు సిరీస్ కోసం ఇప్పటికే కివీస్ వెళ్లారు.