ఖమ్మం : ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పది నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ గెలిచి తీరుతుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ స్పష్టం చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర ప్రజానీకం శ్రేయస్సు కోసం అరగంట కింద యాగం చేసి వచ్చాను. ఉద్యమ చైతన్యం ఖమ్మం జిల్లాలో బాగా ఉండేది. రాజకీయంగా మాత్రం సరైన ఫలితాలు వచ్చేవి కావు. కొంచెం కఠినంగా అనిపించినా వాస్తవాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే అవి శాశ్వతంగా ఉంటాయి. ఉత్తర తెలంగాణ పుణ్యం వల్ల టీఆర్ఎస్ పార్టీ నేరుగా అధికారంలోకి వస్తది. మైనస్ ఖమ్మం, మైనస్ హైదరాబాద్ పోరాడాలి అని ఆనాడు చర్చ వచ్చింది. ఈ మధ్యలో ఎన్నికల చర్చ ప్రారంభమైనప్పుడు.. నాడు మైనస్ ఖమ్మంతో మొదలుపెడితే.. ఇవాళ ప్లస్ ఖమ్మంతో మొదలుపెట్టమని చెప్పిన. ఈసారి ఖమ్మం జిల్లాలో పదికి పది స్థానాలు గెలువబోతున్నాము. ఎన్నికలు అన్నప్పుడు కుల సమస్యలు, డబ్బు ప్రవహాలు ఇతరత్రా ఉంటాయి. కానీ ఖమ్మం ప్రజల చైతన్యం ముందు అవి నిలబడబోవు. ఎన్నికలు వచ్చినప్పుడు కొన్ని శక్తులు, కొంతమంది వ్యక్తులు తమ స్వార్థాల కోసం అడ్డు వస్తుంటారు. రాజకీయ కార్యకర్తగా చెబుతున్నా. మనం ఎవరూ శాశ్వతం కాదు. జిల్లా, రాష్ట్రం ప్రజలు శాశ్వతం. కాబట్టి రాష్ట్రంలో ఏ జరుగుతుంది అని వివేచనతో ఆలోచించి ఓటేయ్యాలన్నారు.