హైదరాబాద్ : సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో శాతవాహన రాజు శివశ్రీ శాసనాలు రెండు బయట పడినట్టు తెలంగాణ వారసత్వసంపదశాఖ సంచాలకురాలు ఎన్ఆర్ విశాలాచ్చి తెలిపారు. శనివారం ఎంసీఆర్హెచ్చార్డీలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఫణిగిరిలో పదిహేనురోజులుగా వివిధ దేశాల నుంచి వచ్చిన పరిశోధకుల ఆధ్వర్యంలో తవ్వకాలు జరుగుతున్నాయని చెప్పారు. శాతవాహన రాజు పేరిట రెండు శాసనాలు లభ్యం కావడం ఇదే మొదటిసారి అన్నారు. గ్రీకు చరిత్రకారుడు మెగస్తనీసు తన ఇండికా పుస్తకంలో కొండాపూర్, పెద్ద బంకూర్, కోటి లింగాల, అమరావతి, ఫణిగిరి మొదలైనవి ప్రముఖ బౌద్ధక్షేత్రాలుగా పేర్కొన్నారని, ఆయా ప్రాంతాల్లో చేపట్టిన తవ్వకా ల్లో ఎన్నో శాసనాలు, నాణేలు బయల్పడ్డాయన్నారు. క్రీ. పూ.1వ శతాబ్దం నుంచి క్రీ.శ.4వ శతాబ్దం వరకు ఆంధ్రప్రదేశ్లో అమరావతి, తెలంగాణలో నాగార్జున కొండ, ఫణిగిరి బౌద్ధక్షేత్రాలుగా విరాజిల్లాయని తెలిపారు. ఫణిగిరిలో మ్యూజియం ఏర్పాటుచేయడమే లక్ష్యంగా తవ్వకా లు చేపడుతున్నట్టు చెప్పారు. ఫణిగిరిలో బయల్పడినవి క్రీ. పూ. 2వ శతాబ్దానికి చెందినవని ఏఎస్ఐ ఎపిగ్రాఫికల్ బెంగుళూరుడైరెక్టర్ డాక్టర్ మునిరత్నంరెడ్డి తెలిపారు. శాసనాల మీద రానో వశిష్టి పుత్రస్య- (శివ) సిరియన్- ఆదివాసస్య.. వర్ష సత అని బ్రాహ్మిలిపిని సంస్కృత భాషలో ఉందన్నారు.