జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన "పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రం”ను శాసనసభ స్పీకర్ శ్రీ పోచారం శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్ షిండే, రీజనల్ పాస్ పోర్ట్ ఆఫీసర్ డా. విష్ణువర్ధన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఎన్. సత్యనారాయణ, జిల్లా ఎస్పీ శ్వేతా రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి ప్రసంగించారు. ప్రజల సౌకర్యార్థం నెలకొల్పిన ఈ పోస్ట్ ఆఫీస్ పాస్ పోర్ట్ సేవా కేంద్రంతో జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం ఉంటుందన్నారు. పరిపాలనను క్షేత్ర స్థాయిలో ప్రజలకు అందుబాటులో తీసురావడానికి ప్రభుత్వాలు చర్యలను తీసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో గతంలో 3 పాస్ పోర్ట్ సేవా కేంద్రాలు ఉండగా తాజాగా మరో 14 కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నారు. గతంలో పాస్ పోర్ట్ అంటే భగీరధ ప్రయత్నంగా ఉండేది. ప్రతి నెలా కామారెడ్డి జిల్లా నుండి 1300 మందికి పైగా ప్రజలు నూతనంగా పాస్ పోర్ట్ కోసం ధరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంలోనే ఏర్పాటు చేయడంతో ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం జిల్లా కేంద్రాలలో అన్ని రకాల సౌకర్యాలు, వసతులు ఏర్పాటు చేస్తున్నది. పరిపాలన సౌలభ్యం కోసం నూతనంగా జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామ పంచాయతీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. దూరంగా లేదా ఇతర గ్రామాలలో ఉన్న పోస్ట్ ఆఫీస్ కు వెళ్ళలేని వృద్దులకు, వారి స్వగ్రామంలోనే పెన్షన్లు అందించాలని పోస్టల్ డిపార్ట్ మెంట్ ను స్పీకర్ కోరారు.