న్యూఢిల్లీ: పుల్వామా దాడి నేపథ్యంలో.. సీఆర్పీఎఫ్ జవాన్లకు కేంద్ర హోంశాఖ భారీ ఆఫర్ ఇచ్చింది. ఢిల్లీ నుంచి శ్రీనగర్ లేదా శ్రీనగర్ నుంచి ఢిల్లీ, ఆ తర్వాత జమ్మూ టు శ్రీనగర్, శ్రీనగర్ టు జమ్మూ మధ్య ప్రయాణించే జవాన్లకు కమర్షియల్ విమాన చార్జీలను చెల్లించనున్నారు. ఈ సౌకర్యం ద్వారా సుమారు 7 లక్షల 80వేల మంది సీఆర్పీఎప్ జవాన్లకు లాభం జరగనున్నది. కానిస్టేబుల్, హెడ్కానిస్టేబుల్, ఏఎస్ఐ ర్యాంక్లో ఉన్నవారు కూడా విమాన ప్రయాణ సౌకర్యాన్ని వాడుకోవచ్చు. ఆన్డ్యూటీలో ఉన్నా లేక లీవ్లో ఉన్నా విమానం ద్వారా ప్రయాణించవచ్చు. ఈనెల 14వ తేదీన సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై పుల్వామాలో కారు బాంబు దాడి జరిగిన విషయం తెలిసిందే. ఆ దాడిలో 40 మంది జవాన్లు మృతిచెందారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ.. సీఆర్పీఎఫ్ జవాన్లకు విమాన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నది.