ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యాది.. నేటితో మిలియన్ మార్చ్‌‌కు 8 ఏళ్లు పూర్తి..

Telangana Telugu |  Suryaa Desk  | Published : Sun, Mar 10, 2019, 08:05 PM

ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోవడానికి పెద్ద ఎత్తున్న పోరాటం జరిగిన విషయం తెలిసిందే. యావత్ తెలంగాణ ప్రజలందరూ ముక్త కంఠంతో ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ అవతరిస్తేనే తమ దశ దిశ మారుతుందని నినదించారు. ఈ క్రమంలో ఎందరో అమరుల య్యారు. మరెందరో లాఠీ దెబ్బలు తిన్నారు. కలాలు ఝళిపించారు. రాస్తారోకోలు, ధర్నాలతో ఉమ్మడి రాష్ట్రం అట్టుడికిపోయిందనే చెప్పాలి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అప్పుడు ఉద్యమ నాయకుడిగా అనేకానేక త్యాగాలు, పోరాటాలు చేశారు.
ఈ క్రమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమానికి మరింత ఊతమిచ్చింది మిలియన్ మార్చ్.  తెలంగాణ ఉద్యమ చరిత్రలో మిలియన్ మార్చ్‌ది ఓ ప్రత్యేక స్థానం. నేటితో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటోంది మిలియన్ మార్చ్. 2011 మార్చి 10 న ప్రజలందరూ కలిసి ట్యాంక్ బండ్ ప్రాంతాన్ని చుట్టుముట్టారు.
లక్షలాదిగా తరలివచ్చిన తెలంగాణ జనంతో ఆరోజు ట్యాంక్ బండ్ కిక్కిరిసిపోయింది. మార్చ్‌ను నిర్వీర్యం చేయాలని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్భంధాన్ని ప్రయోగించింది. జిల్లాల బార్డర్లలో పోలీసుల దిగ్భంధాలు, అడ్డంకులు, బ్యారికేడ్లు, ఇనుపకంచెలను ఏర్పాటు చేసింది. అయినా తెలంగాణ వాదులను ఆపలేకపోయాయి. హైదరాబాదు నగరమంతా పోలీసులు, పారామిలటరీ బలగాలు మోహరించినా ఫలితం లేకుండా పోయింది. ఇంటలిజెన్స్ వర్గాలు పసిగట్టలేనంత పక్కాగా ప్లాన్ చేసుకున్నారు తెలంగాణ వాదులు. ఆనాడు ‘మిలియన్ మార్చ్’ ధాటికి పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహించక తప్పలేదు.
ప్రొ. కోదండరాం ఆధ్వర్యంలో జేఏసీ ఒక రోజంతా చర్చించి మిలియన్ మార్చ్‌ను ఒక ర్యాలీ రూపంలో జరపాలని నిర్ణయించాయి. ప్రజల నుంచి మిలియన్ మార్చ్ ప్రచారానికి అపూర్వ స్పందన రావడంతో టీఆర్ఎస్‌తో పాటు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, వామపక్షాలు కూడా కలసికట్టుగా కదం కదిపాయి. ఆ ఉద్యమం జరిగిన రోజు ఈరోజు కాబట్టి గుర్తు చేసుకున్నాం. అప్పటి గాయాలు నొప్పి పెట్టినా ఇప్పడవి తీయని జ్ఞాపకాలనే చెప్పాలి. ఏదీ ఊరికే రాదు అన్నట్టే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కూడా ఊరికినే రాలేదు. ఎన్నో బలిదానాలు, ఉద్యమాలు, పోరాటాలు, వాటికి ధీటుగా సమైక్యాంధ్రవాదుల కుట్రలు కుతంత్రాలను పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్రం అవతరించింది.


 










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com