ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫివర్ మొదలైంది. అయితే పోలింగ్ కు స్వల్ప సమయం ఉండడంతో రాజకీయ పార్టీలలో టెన్షన్ మొదలైంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఏప్రిల్ 11వ తేదీన పోలింగ్ జరుగుతోంది. తెలంగాణలో పార్లమెంటు, ఏపీలో పార్లమెంటు, అసెంబ్లీ కి పోలింగ్ జరగనున్నది. పోలింగ్ జరిగిన 41 రోజుల తరువాత ఫలితాలు రానున్నాయి. పోలింగ్ కు, ఫలితాల ప్రకటనకు మధ్య 41 రోజుల వ్యవధి నిర్ణయించడం కూడా రాజకీయ పార్టీ నేతలకు ఒకింత టెన్షన్ కలిగించేదే. అభ్యర్థుల ఎంపిక మొదలు ప్రచారం, ప్రచార సామగ్రి పంపిణీ, వనరులను సమకూర్చేందుకు 31 రోజుల సమయం చాల స్వల్పం. ఈ స్వల్ప సమయంలో ప్రతి నిమిషం విలువైనదే.
ఏపీలో టీడీపీ అధినేత ఎన్.చంద్రబాబు నాయుడు, వైసీపీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కొద్ది రోజులుగా ప్రచార ఉధృతిని పెంచారు. జగన్, పవన్ కంటే ముందు వరుసలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. గత పది రోజులుగా పార్లమెంటు నియోజకవర్గాల వారీగా సుధీర్ఘ సమీక్షలు చేస్తున్నారు. కర్నూలు జిల్లాలో కోట్ల విజయ భాస్కర్ రెడ్డి కుటుంబం, గౌరు వెంకట రెడ్డి కుటుంబాలు చేరడంతో బలం రెట్టింపు అయ్యే అవకాశం ఉంది. అలాగే దగ్గుబాటి వెంకటేశ్వర రావు, నార్నే శ్రీనివాస రావులు జగన్ కలిసి పార్టీలో చేశారు. దగ్గుబాటి కుమారుడు, నార్నే శ్రీనివాస రావుకు టికెట్ కేటాయించనున్నట్లు తెలిసింది. మరో ఇద్దరు టీడీపీ ఎంపీలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. రెండు పార్టీలకు వలసలు ఉండగా, జనసేనకు ఆశించిన స్థాయిలో వలసలు లేవు. ఆయన కొత్త రక్తాన్ని, యువకులను నమ్ముకుని ముందుకు సాగుతున్నారు. రాజకీయాల్లో చెప్పుకోదగ్గ నాయకులు ఇంత వరకు జనసేన పార్టీలో చేరలేదు.
తెలుగుదేశం పార్టీలో టికెట్ల కేటాయింపుపై తుది దశ కసరత్తు పూర్తి కాగా, వైసీపీలో ఆ స్థాయిలో కసరత్తు జరగలేదనే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. పాదయాత్ర కారణంగా నియోజకవర్గాల వారీగా కసరత్తు చేసేందుకు సమయం చిక్కలేదంటున్నారు. కోడికత్తి దాడి కారణంగా పార్టీ సమీక్షల్లో వెనకబడ్డారు. తెలుగుదేశం పార్టీని లక్ష్యంగా చేసుకుని కో డికత్తి పై విమర్శలు గుప్పించారు తప్పితే, వైఫల్యాలను ఎండగట్టడంతో వెనకబడ్డారని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. జనసేన పార్టీకి బూత్ స్థాయి కార్యకర్తల బలం లేకపోవడం, జిల్లాల వారీగా కమిటీలు లేకపోవడం మైనస్ గా పరిణమించే ప్రమాదమున్నది.