తెలుగు రాష్ట్రాల మధ్య కలకలం రేపుతున్న డేటా చోరీ కేసులో తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చెయ్యడాన్ని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ విజయశాంతి తప్పుబట్టారు. ఐటీ గ్రిడ్ వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వం సిట్ ద్వారా విచారణకు ఆదేశించడం వింతగా ఉందన్నారు. ఐటీ గ్రిడ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని దుర్వినియోగం చేసి, ఓటర్ల జాబితాను తారుమారు చేస్తారన్న ఆరోపణపై తెలంగాణ పోలీసులు కేసులు పెడుతున్నారంటూ విజయశాంతి వ్యాఖ్యానించారు.
పొరుగురాష్ట్రానికి సంబంధించిన ఈ అంశంపై కేసీఆర్ ప్రభుత్వం ఏకంగా సిట్ ద్వారా విచారణ జరిపి వాస్తవాలను వెలుగులోకి తెస్తామని చెప్తోందంటూ మండిపడ్డారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 20 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రతిపక్షాలు అరిచి గీపెట్టినా, టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విజయశాంతి గుర్తు చేశారు.
పొరుగు రాష్ట్రంలో జరిగే అన్యాయానికైతే సిట్ వేస్తారా…అదే తెలంగాణలో జరిగితే సిట్ అంటూ ప్రతిపక్షాల గొంతు నొక్కుతారా అంటూ ధ్వజమెత్తారు. కేసీఆర్ కోరుకుంటున్న ఫెడరల్ వ్యవస్ధ అంటే ఇలాగే ఉంటుందేమోనని విజయశాంతి సెటైర్లు వేశారు.
వైసీపీ అధినేత వైఎస్ జగన్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీ నారాయణలు డేటా చోరీ వ్యవహారంపై గవనర్నర్ నరసింహన్ ను కలిసన వెంటనే సిట్ ఏర్పాటు చెయ్యడం పలు అనుమానాలకు తావిస్తోందని ఆరోపించారు. మోదీ ముసుగులో తెలుగు రాష్ట్రాల్లో కుట్ర జరుగుతుందన్న వాదనలకు ఈ పరిణామాలు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయని విజయశాంతి చెప్పుకొచ్చారు.