హైదరాబాద్ : ఇథియోపియోలో కూలిన విమానానికి సంబంధించిన బ్లాక్ బాక్సు దొరికింది. ఫ్లయిట్ రికార్డులు దొరికినట్లు దర్యాప్తు చేసే అధికారులు వెల్లడించారు. విమానం కూలిన ప్రదేశం నుంచి కాక్పిట్ వాయిస్ రికార్డర్, డిజిటల్ ఫ్లయిట్ డేటా రికార్డర్ను స్వాధీనం చేసుకున్నారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబబా నుంచి బయలుదేరిన ఆరు నిమిషాలకే.. బోయింగ్ 737 మాక్స్ 8 విమానం కూలింది. ఆదివారం జరిగిన ఆ ఘటనలో 157 మంది మరణించారు. సుమారు 30 దేశాలకు చెందిన వ్యక్తులు విమానంలో ప్రయాణిస్తున్నట్లు గుర్తించారు. అయితే బోయింగ్ 737 విమానాలను ఇథియోపియా, చైనా దేశాలు రద్దు చేశాయి. ఆ దేశాల్లో నడుస్తున్న ఆ విమానాలను గ్రౌండ్ చేశారు. ఇథియోపియా ప్రమాదం నేపథ్యంలో .. భారత ప్రభుత్వం కూడా కీలక నిర్ణయం తీసుకోనున్నది. భారత పౌర విమానయాన శాఖ దీనిపై చర్చించనున్నది. భారతీయ వైమానిక శాఖలకు డీజీసీఏ అదనపు భద్రతా ఆదేశాలు ఇవ్వనున్నది. బోయింగ్ విమానాలను వాడుతున్న ఇండియన్ ఆపరేటర్లకు డీజీసీఏ ఈ ఆదేశాలు జారీ చేయనున్నది.