హైదరాబాద్: రూ.90.50లక్షల హవాలా సొమ్ము స్వాధీనం చేసుకున్నట్లు నగర సీపీ అంజనీకుమార్ తెలిపారు. నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో మరో హవాలా రాకెట్ గుట్టురట్టయ్యింది. కాచిగూడ, సుల్తాన్ బజార్ పోలీసు స్టేషన్ల పరిధిలో హవాలా నిర్వహిస్తున్న ముఠా సభ్యులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎన్నికల కోడ్ దృష్ట్యా వాహనాలను తనిఖీలు చేయగా ఈ విషయం వెలుగు చూసింది. నలుగురు హవాలా వ్యాపారుల నుంచి రూ. 90.50 లక్షలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ నలుగురు సభ్యులు వేర్వేరుగా బస్సుల్లో నగదు తరలిస్తుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడిన నగదుకు సంబంధించి ముఠా సభ్యులు ఎలాంటి ఆధారాలు చూపించలేదని సీపీ అంజనీ కుమార్ తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున నగరంలో విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో రూ. 29 కోట్ల నగదు, 3 కోట్ల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.