సైబరాబాద్ కమీషనరేట్ పరిధిలో రూ.1000కోట్ల మల్టీ లెవల్ మార్కెటింగ్ స్కామ్ వెలుగుచూసింది. Ebiz అనే సంస్థ ప్రజల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసి మోసానికి పాల్పడింది. Ebiz సంస్థ నిర్వాహకుల మాయ మాటలు నమ్మి అందులో పెట్టుబడి పెట్టినవారంతా ఇప్పుడు లబోదిబో అంటున్నారు. పెట్టిన డబ్బుకు భారీ మొత్తంలో రిటర్న్స్ వస్తాయన్న ఆశతో పెట్టుబడులు పెడితే.. అసలుకే దిక్కు లేకుండా పోయింది. బాధితులు దీనిపై సైబరాబాద్ పోలీసులను ఆశ్రయించడంతో Ebiz సంస్థ అకౌంట్లో ఉన్న రూ.70లక్షలు సీజ్ చేశారు.సైబరాబాద్ కమిషనర్ సజ్జనార్ మంగళవారం దీనిపై మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలను వెల్లడించారు.
Ebizలో చేరడానికి మొదట రూ.16,821 వసూలు చేస్తారు. అలా చేరినందుకు గాను 10వేల పాయింట్స్ యాడ్ అయినట్టు చెబుతారు. సంస్థలో చేరాక.. ఎంతమందిని చేర్పిస్తే అంత కమీషన్ ఇస్తామని నమ్మబలుకుతారు. వారు చేర్పించే సభ్యుల సంఖ్యను బట్టి గోల్డ్ మెంబర్, డైమండ్ మెంబర్ హోదాలు ఇస్తారు. ప్రతీ నెలా పెద్ద పెద్ద హోటల్స్లో సెమినార్స్ నిర్వహిస్తారు. ఇవన్నీ చూసి నిజంగానే కోట్లు సంపాదించవచ్చునని సామాన్యులు భ్రమపడుతారు. తీరా అందులో దిగాక.. పైనున్న వాళ్లకే తప్పించి తమకెలాంటి లాభం లేదని తెలిసి మోసాన్ని గ్రహిస్తారు. ఎక్కువగా డిగ్రీ ఇంజనీరింగ్ చదివే యువత, మహిళలు, రిటైర్డ్ ఉద్యోగులను టార్గెట్ చేసి Ebiz నిర్వాహకులు డబ్బులు వసూలు చేశారు.కేసులో ప్రస్తుతానికి ఇద్దరిని అరెస్ట్ చేశామని, మరికొంతమందిని అరెస్ట్ చేయాల్సి ఉందని సజ్జనార్ తెలిపారు. దీనిపై మరింత లోతుగా దర్యాప్తు జరుపుతున్నామని స్పష్టం చేశారు.