లక్నో: పాకిస్థాన్లో ఉగ్రస్థావరాలపై ఇండియన్ ఎయిర్ఫోర్స్ దాడులను బీజేపీ రాజకీయం చేస్తున్నదన్న ఆరోపణల మధ్య యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మరోసారి అలాంటి కామెంట్స్ చేశారు. పాక్లోని బాలాకోట్లో ఐఏఎఫ్ దాడి.. కచ్చితంగా మరోసారి మోదీని అధికారంలోకి తీసుకొస్తుందని యోగి ట్వీట్ చేశారు. యూపీలో మొత్తం 80 స్థానాల్లో 74 బీజేపీయే గెలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ మేరకు యూపీ సీఎం హిందీలో ఓ కవితను ట్వీట్ చేశారు. పాక్లో ఐఏఎఫ్ దాడి అన్నది చాలా సాహసోపేత నిర్ణయం.. ఇది కచ్చితంగా మోదీ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని మరోసారి అధికారంలోకి తీసుకొస్తుంది అని యోగి ట్వీట్లో స్పష్టం చేశారు. ఐఏఎఫ్ దాడిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్న ప్రతిపక్షాలపై ఆయన వరుస ట్వీట్లలో విరుచుకుపడ్డారు. ఈ దాడులు బీజేపీకి కలిసి వస్తాయని గతంలో కర్ణాటక, జార్ఖండ్లోని బీజేపీ నేతలు కూడా చెప్పిన విషయం తెలిసిందే. ఇక పార్టీ ఫండ్ కోసం యోగి ఆదిత్యనాథ్ తన జీతంలో నుంచి రూ.2.51 లక్షలు డొనేట్ చేయడం విశేషం. అంతేకాదు రాష్ట్రంలోని అందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు, ఉపాధ్యక్షులు కూడా తమ జీతాలను విరాళం రూపంలో పార్టీకి ఇవ్వాలని కోరారు.