రేపోమాపో టీఆర్ఎస్ పార్టీలో చేరతారని భావిస్తున్న మహేశ్వరం కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెనక్కి తగ్గినట్లు సమాచారం. కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి జోక్యంతో విషయం అధిష్టానానికి చేరినట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. అధ్యక్షుడు రాహుల్ గాంధీ స్వయంగా సబితతో ఫోన్లో మాట్లాడి.. పార్టీని వీడొద్దని నచ్చజెప్పినట్లు పేర్కొన్నాయి. దీంతో సబిత, ఆమె కుమారుడు కార్తీక్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీలో చేరకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. వీరిద్దరూ ఆదివారం ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ నివాసంలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎంపీ కవితలను కలవడం తెలిసిందే. దీంతో పార్టీ మారుతున్నట్లు ప్రచారం జరిగింది.
విశ్వసనీయ వర్గాలు తెలిపిన వివరాల ప్రకరాం.. నష్ట నివారణ కోసం అధిష్టానం ఆదేశంపై రేవంత్ రెడ్డి రంగంలోకి దిగారు. తల్లీకొడుకులతో సోమవారం రాత్రి మాట్లాడారు. ఢిల్లీ నుంచి రాహుల్ గాంధీతోనూ మాట్లాడించారు. రాహుల్ బుజ్జగింపుతో సబిత, కార్తీక్ మెత్తబడ్డారు. వీరిద్దరూ ఈ రోజు(మంగళవారం) సాయంత్రం వెళ్లి రాహుల్ గాంధీతో సమావేశం కానున్నట్లు పార్టీ వర్గాలు చెప్పాయి. చేవెళ్లను ఎంపీ టికెట్ను తన కొడుక్కి కాకుండా ఇటీవలే పార్టీలో చేరిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఇవ్వనున్నట్లు వార్తలు రావడంతో సబిత ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది.