‘సబ్ కా సాత్ సబ్ కా వికాస్ అంటూ ప్రధాని మోదీ తెలంగాణ ప్రజలకు హాత్ ఇచ్చారు.. ’ అని టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. నల్లధనం, తెలంగాణకు అన్యాయం తదితర అంశాలపై మోదీ సర్కారు తీరును ఆయన ఎండగట్టారు. పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ రోజు జరిగిన సికింద్రాబాద్ లోక్ సభ నియోజకవర్గ సన్నాహక సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. సికింద్రాబాద్ ఎంపీ సీటును కైవశం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ‘నల్లధనం వెలికితీసి పేదవాళ్ల ఖతాల్లో రూ.15 లక్షలు వేస్తామన్న మోదీ హామీ ఏమైంది? బండారు దత్తాత్రేయను కేంద్ర మంత్రి పదవి నుంచి అకారణంగా తొలగించారు రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేకుండా చేశారు. అలాంటి బీజేపీకి తెలంగాణలో ఓటు అడిగే హక్కే లేదు. ఆ పార్టీని ఘోరంగా ఓడిస్తాం. మన దేశంలో మోదీ, రాహుల్ తప్ప ఇతర నాయకులే లేరా? అయితే భోఫోర్స్.. లేదా రాఫేల్ కుంభకోణాలు చేయడానికేనా వారిని ఎన్నుకంటున్నది. దేశోం మోదీ హవా లేదు. .రాహుల్కు ఆదరణ లేదు..’ అని అన్నారు. బీజేపీ రాష్ట్ర నేతలు అనవసర ఆరోపణలు, ప్రగల్భాలు గుప్పిస్తున్నారని, జీహెచ్ఎంసీ ఎన్నికలతోపాటు అన్ని ఎన్నికల్లో ఆ పార్టీ ఘోరంగా ఓడిపోయిందన్నారు.
టీఆర్ఎస్కు 16 సీట్లు వస్తే ఏం చేస్తారని దత్తాత్రేయ అడిగిన ప్రశ్నపైనా కేటీఆర్ స్పందించారు. ‘ఇద్దరు ఎంపీలతో రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్.. అదే 16 మందిని గెలిపిస్తే ఢిల్లీ మెడలు వంచుతారు. ఆయన నాయకత్వం దేశానికి ఆదర్శంగా నిలిచింది. కాంగ్రెస్, బీజేపీలు దేశాన్ని డెబ్బై ఏళ్లు పాలించినా ఇంకా కరెంటు, రోడ్లు లేని గ్రామాలు ఉన్నాయి.. ’ అని అన్నారు.