హైదరాబాద్: ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి మరో పెద్ద ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పాలేరులో తుమ్మలపై గెలుపొందిన కందాళ ఉపేందర్ రెడ్డి తెరాస గూటిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్టు సమాచారం. వచ్చే ఎన్నికల్లోనూ తిరిగి సీటు ఇస్తామన్న హమీ ఉపేందర్ రెడ్డికి లభించినట్టు సమాచారం. దీంతో ఆయన గులాబీ గూటిలో చేరేందుకు సంసిద్ధత వ్యక్తంచేసినట్టు సమాచారం. త్వరలోనే ఆయన తెరాసలో చేరే అవకాశం కనబడుతోంది. అవసరమైతే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెరాస బీ ఫారంపై పోటీచేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది.
గత కొంత కాలంగా కాంగ్రెస్నుంచి తెరాసలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ వేగం మరింత పుంజుకుంది. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆత్రం సక్కు, రేగ కాంతారావు, హరిప్రియ నాయక్, చిరుమర్తి లింగయ్య తెరాసలో చేరగా.. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆమె తనయుడు కార్తీక్ రెడ్డి సైతం తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నారు. అలాగే తెదేపా ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా తెరాసలో చేరనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ మేరకు ఆయన తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్తో భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. గత కొంతకాలంగా తెరాస నేతలు ఉపేందర్ రెడ్డితో టచ్లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కాంగ్రెస్ను వీడి తెరాసలో చేరాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది.