హైదరాబాద్: వ్యాపారవేత్త చిగురుపాటి జయరాం హత్య కేసులో పోలీసులు మరో ముగ్గురిని అరెస్టు చేశారు. సినీ సహాయ నటుడు సూర్య ప్రసాద్, కిశోర్తో పాటు స్థిరాస్తి వ్యాపారి అంజిరెడ్డిని అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు 90శాతం పూర్తయిందని పశ్చిమ మండలం డీసీపీ శ్రీనివాస్ వెల్లడించారు. శిఖా చౌదరికి జయరాం హత్య కేసుతో సంబంధం లేదని డీసీపీ స్పష్టంచేశారు. జయరాంను బెదిరించి డబ్బు వసూలు చేయాలనే రాకేశ్ రెడ్డి కుట్ర పన్నాడని తెలిపారు. సూర్య ప్రసాద్, కిశోర్ జయరాంను రాకేశ్ రెడ్డి ఇంటికి తీసుకెళ్లారని, హత్య అనంతరం అంజిరెడ్డి అనే స్థిరాస్తి వ్యాపారి రాకేశ్ రెడ్డి ఇంటికి వెళ్లినట్టు డీసీపీ వివరించారు. రాకేశ్ రెడ్డి హత్య చేసిన విషయం తెలిసినా అంజిరెడ్డి చెప్పలేదన్నారు. జయరాంను బెదిరించి రాయించుకున్న పత్రాలు అంజిరెడ్డి వద్ద దాచాడన్న డీసీపీ.. హత్యతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలేది లేదని స్పష్టంచేశారు. పోలీసుల ప్రమేయంపైనా ఆధారాలు సేకరిస్తున్నామని, రాకేశ్ రెడ్డి ప్రగతి రిసార్ట్స్ యజమానులను బెదిరించాడని తెలిపారు. రాకేశ్ రెడ్డికి రాజకీయ నాయకులతో సంబంధాలు ఉన్న మాట వాస్తవమేనని.. ఈ హత్య కేసులో నేతల ప్రమేయం ఉన్నట్టు ఆధారాల్లేవని చెప్పారు.