అహ్మదాబాద్: పబ్జీ గేమ్ ఆడినందుకు పది మంది విద్యార్థులను పోలీసులు అరెస్టు చేశారు. ఇదేంటి గేమ్ ఆడినందుకు అరెస్టు చేస్తారా? అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి! నిజమే ఇది. గుజరాత్లోని అహ్మదాబాద్లో పది మంది యూనివర్సిటీ విద్యార్థులను బుధవారం పోలీసులు అరెస్టు చేశారు. ఈ గేమ్ వల్ల పిల్లలు ప్రవర్తన, భాషలో మార్పు రావడంతో పాటు వారి చదువు కూడా నాశనం అవుతోందని గుజరాత్ ప్రభుత్వం ఈ ఆటను రాష్ట్రంలో పూర్తిగా నిషేధించింది. అయినప్పటికీ పబ్జీ ఆడుతుండటంతో విద్యార్థులని పోలీసులు అరెస్టు చేశారు.‘విద్యార్థుల పూర్తిగా గేమ్లో నిమగ్నమైపోయి మేము వెళ్లినా మమ్మల్ని చూడలేదు’ అని పోలీసు అధికారి రోహిత్ రావల్ మీడియాతో తెలిపారు. అరెస్టు చేసిన కొద్ది గంటల్లోనే విద్యార్థులని విడుదల చేశారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 100 మిలియన్ల మంది ఈ గేమ్ను తమ మొబైల్ ఫోన్లలో డౌన్లోడ్ చేసుకున్నట్లు సమాచారం. మన దేశంలో పబ్జీని ఒక్క గుజరాత్ ప్రభుత్వం మాత్రమే నిషేధించింది. పబ్జీ గేమ్ హింసను ప్రేరేపించడంతో పాటు, విద్యార్థలను చదువు నుంచి దూరం చేస్తోందని విద్యావేత్తలు హెచ్చరిస్తున్నారు.