హైదరాబాద్ : సిటీలో మార్చి 15, 16వ తేదీల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తున్నట్లు ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ అనిల్కుమార్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉపరాష్ట్రపతి బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి జూబ్లీహిల్స్లోని నివాసానికి వెళ్తారు. శనివారం ఉదయం 9.30 గంటలకు తార్నాకలోని సరోజిని నాయుడు వనిత ఫార్మసీ మహా విద్యాలయంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. తిరిగి అక్కడి నుంచి 11గంటలకు జూబ్లీహిల్స్లోని ఇంటికి చేరుకుంటారు. ఈ నేపథ్యంలో ఉపరాష్ట్రపతి ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ మళ్లింపులు/వాహనాలను నిలిపివేస్తామని ఆయన చెప్పారు. ఈ ఆంక్షలను దృష్టిలో పెట్టుకుని ఆ సమయంలో ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని అనిల్కుమార్ కోరారు.