లోక్సభ ఎన్నికల్లో ఎక్కడి నుంచైనా తాను పోటీ చేస్తానని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్రెడ్డి అన్నారు. సీఎల్పీ కార్యాలయం లో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు సీనియర్లు ముందుకు రావాలని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అన్నారు. పార్టీ ఆదేశిస్తే పోటీకి రెడీ అని అన్నారు. పార్లమెంటు ఎన్నికలలో సీనియర్లు రంగంలోకి దిగితే కేడర్ కు మనోధైర్యం కలుగుతుందని అన్నారు. పార్టీ ఆదేశిస్తే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజక వర్గాలలో ఎక్కడి నుంచైనా పోటీ చేయడానికి తాను సిద్ధమని పేర్కొన్నారు.పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు నాయకుడిగా అధిష్ఠానం ఆదేశించినట్లు నడుచుకోక తప్పదన్నారు. ఎన్నికల్లో గెలిచినా ఓడినా కూడా పార్టీ కార్యకర్తలు, శ్రేణుల్లో, ధైర్యం, ఆత్మస్థైర్యం నింపాల్సిన అవసరం ముఖ్యనేతలకు ఉందని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాలు వార్ జోన్లో ఉన్నాయని అభిప్రాయ పడ్డారు. పోరాడే సమయంలో నాయకుడు పోరాడాల్సిందేనని, ఇది తన బాధ్యత అనుకుంటున్నానని తెలిపారు.
2014 సార్వత్రిక ఎన్నికల్లో అధిక మెజారిటీతో గెలిచిన బీజేపీ.. మూడు మాసాల తర్వాత వచ్చిన శాసనసభ ఎన్నికల్లో ఢిల్లీలో ఎందుకు ఓడిపోయిందని ప్రశ్నించారు. కేసీఆర్ గచ్చిబౌలి దివాకర్ అయితే కాంగ్రెస్ తెందూల్కర్ లాంటిదని వ్యాఖ్యానించారు. సంప్రదాయాల పేరిట టీఆర్ఎస్ కాంగ్రెస్ మద్దతు తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్కు సంఖ్యాబలం ఉన్నా కేసీఆర్ ఎలా అయిదో ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టారు అని ప్రశ్నించారు.