హైదరాబాద్ : తెలంగాణలోని అన్ని లోక్సభ నియోజకవర్గాల కేంద్రాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ తెలిపారు. ఈ నెల 25వ తేదీ వరకు నామినేషన్లను స్వీకరిస్తామని చెప్పారు. అయితే భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 21వ తేదీ(హోళీ), 23(నాలుగో శనివారం), 24(ఆదివారం)వ తేదీన సెలవులు కాబట్టి.. ఆ రోజుల్లో నామినేషన్లను స్వీకరించమని స్పష్టం చేశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘిస్తే కఠినంగా వ్యవహరిస్తామని తేల్చిచెప్పారు. సమస్యాత్మక నియోజకవర్గాల్లో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటామన్నారు. నామినేషన్ల దాఖలు కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశామన్నారు. అధికారుల అనుమతితోనే ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. నామినేషన్ పత్రంలోని ప్రతికాలంలోనూ వివరాలు నమోదు చేయాలి. వివరాలు సరిగా నమోదు చేయకపోతే నామినేషన్ను తిరస్కరిస్తామని స్పష్టం చేశారు. విదేశీ ఆస్తుల వివరాలను కూడా ఆఫిడవిట్లో పేర్కొనాలని సూచించారు. విద్యార్థులను ఎన్నికల ప్రచారానికి వాడుకోవద్దు. ఎన్నికలకు పూర్తి స్థాయి సిబ్బంది కేటాయింపులు చేశామని రజత్ కుమార్ స్పష్టం చేశారు.